నివేదిక: జైళ్లలోని ఖైదీల్లో 53శాతం దళితులు, ముస్లింలే
న్యూఢిల్లీ: ఇండియాలోని జైళ్లలో ఉన్న వారిలో 53 శాతం మంది దళిత, ముస్లిం, ఆదివాసీ తరగతులకు చెందిన వారని ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. 2013 నుంచి ప్రస్తుతానికి 4.2 లక్షల మంది వివిధ కేసులలో శిక్షను అనుభవిస్తూ జైళ్లలో ఉండగా, అందులో 20 శాతం మంది ముస్లింలు.
22 శాతం మంది దళితులు కాగా, 11 శాతం మంది ఆదివాసీలు జైళ్లలో ఉన్నారని కేంద్ర గణాంకాల శాఖ వివరించింది. ఐతే జైళ్లలో ఎక్కవగా ఉన్న ఈ వర్గాల వారు అధికంగా నేరాలు చేస్తున్నారని అనుకోకూడదని న్యాయ నిపుణులు పేర్కొన్నారు.
వీరిలో చాలా మందికి సులభంగా బెయిల్ లభిస్తుంది. ఐతే ఆర్ధికంగా వెనుకబడి ఉండటం.. కనీసం బెయిల్ కోసం కావాల్సిన డబ్బులు కూడా లేకపోవడటంతో వీరు బయటకు రాలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. 2006 నుంచి వందల మంది ముస్లిం యువకులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి, ఆ తరువాత నిర్దోషులుగా బయట పడ్డారని ఢిల్లీ హైకోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ రాజేందర్ సచ్చార్ ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ వెల్లడించింది.
జైళ్లలో ఉన్న వారిలో 68 శాతం మంది విచారణ ఖైదీలేనని సచ్చార్ కమటీలో సభ్యుడైన అబుసలేష్ షరీఫ్ తెలిపారు. ఇలాంటి కేసుల విచారణను వేగవంతం చేసి త్వరగా పరిష్కరించాలని కోరారు. జాతీయ దళిత ఉద్యమ సభ్యుడైన రమేశ్ నాథన్ మాట్లాడుతూ దళితులపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.
1995 నుంచి జాతీయ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రతి ఏడాది జైళ్ల స్టాటటిక్స్ను ప్రచురిస్తుంది. గత 15ఏళ్లుగా విడుదల చేస్తున్న ఈ గణాంకాల్లో ఈ మూడు తరగతులకు సంబంధించి ఎలాంటి ఎక్కువ మార్పులు చోటుచేసుకోలేదని పేర్కొంది.