సీఎంగా అఖిలేష్ యాదవ్ సూపర్: బీజేపీ ఎంపీ యాంగ్రీ హీరో
న్యూఢిల్లీ: భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కుటుబ సభ్యులు, సొంత పార్టీ నేతలు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మీద తిరుగుబాటుకు దిగారు. ప్రతిపక్షాలైన బీఎస్ పీ, కాంగ్రెస్ పార్టీలు యూపీ ప్రభుత్వం మీద మండిపడుతున్నాయి.
2017లో జరిగే ఎన్నికలను వీరు టార్గెట్ చేసుకుని ఫ్యామిలి డ్రామా ఆడుతున్నారని విమర్శిస్తున్నాయి. అయితే అందుకు భిన్నంగా బీజేపీ స్పంధించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ సమర్థవంతంగా పని చేస్తున్నాడని, అలాంటి యువ నాయకుడు ఆ రాష్ట్రానికి అవసరం అని బీజేపీ సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు శతృఘ్న సిన్హా స్పంధించారు.
దేశంలోనే పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ సీఎం అయిన తరువాత అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెలుతుందని కితాబు ఇచ్చారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ కు అవసరం అంటూ శతృఘ్న సిన్హా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
2012లో బీజేపీ నాయకులు అఖిలేష్ యాదవ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పటి పరిస్థితుల్లో బీజేపీ అఖిలేష్ యాదవ్ ను సమర్థించడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ విషయంపై కాంగ్రెస్, బీఎస్ పీ నాయకులు మండిపడుతున్నారు.
2017లో సొంతంగా అధికారంలోకి రాలేని తండ్రి, కుమారుడు(ములాయం సింగ్ యాదవ్, సీఎం అఖిలేష్ యాదవ్) డ్రామాలు అడుతున్నారని ఆరోపిస్తున్నారు. వీళ్లకు ధమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాలు విసురుతున్నారు. మొత్తం మీద ఇది డ్రామానా? లేక నిజంగానే పార్టీలో చిచ్చు రేగిందా ? అని యూపీ ప్రజలు వేచి చూస్తున్నారు.