దారుణం: యజమాని కూతురుపై 9నెలలపాటు ట్యూటర్ రేప్
నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్ దారుణ ఘటన చోటు చేసుకుంది. తన యజమాని మైనర్ కూతురు(13)పై ఆమెకు చదువు చెబుతున్న ఓ వ్యక్తి 9నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో మానసికంగా కృంగిపోయిన ఆ బాలిక పాఠశాలకు వెళ్ళడం మానేసింది.
నెలరోజులపాటు పాఠశాలకు బాలిక రాకపోవడంతో స్కూల్ టీచర్ ఆమె ఇంటికి వచ్చి ఈ విషయాన్ని బాలిక తండ్రికి చెప్పడంతో అత్యాచారం విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందిత ట్యూటర్ అక్షయ్ నగుల్కర్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి రెండు రోజుల కస్టడీ విధించింది. మొదట అత్యాచారానికి సంబంధించిన విషయాన్ని తెలపని బాలిక, తల్లిదండ్రులు, టీచర్ అడగడంతో జరిగిన విషయాన్ని చెప్పింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత మంగల్వరి ప్రాంతంలో తన తల్లిదండ్రులతోపాటు ఉంటున్నాడు నిందితు నగుల్కర్. ఇతడు గత ఏప్రిల్ నెలలో ట్యూషన్ చెప్పేందు కోసమని బాధితురాలి ఇంట్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. గత మే నెలలో నిందితుడు తన గదిలో బాలికపై మొదటి సారి అత్యాచారానికి పాల్పడ్డాడు. హోం వర్క్ చేసేందుకని పిలిచిన నిందితుడు ఆమెపై అత్యాచారం చేశాడు.
ఆ తర్వాత ఆమెను బెదిరింపులకు గురిచేస్తూ ఆమెపై తరచూ అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ ఏడాది జనవరి 18 వరకు బాలికపై నిందితుడు అఘాయిత్యాన్ని కొనసాగించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమవారం అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.