అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారమే నగ్రోటా దాడి: సొరంగం చేసి వచ్చారు!
అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారంగానే నగ్రోటా దాడికి పాల్పడినట్లు ఉగ్రవాదుల వద్ద లభ్యమైన పత్రాలు వెల్లడిస్తున్నాయి.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని నగ్రోటాలో మంగళవారం సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడిచేసిన ఘటనలో ఓ మేజర్ తోపాటు ఏడుగురు జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దీంతో సైనిక శిబిరాల వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, సైన్యం కూంబింగ్ నిర్వహిస్తుండగా దాడి జరిగిన స్థావరం వద్ద కాల్పుల్లో చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులకు చెందిన పేపర్లు లభ్యమయ్యాయి.
ఉర్దూ భాషలో ఒక కాగితంపై అఫ్జల్ గురూని చంపినందుకు ప్రతీకారంగా తొలి ఇన్స్టాల్మెంట్ అని రాసి ఉంది. అంతేగాకుండా ఉగ్రవాదుల వద్ద లభ్యమైన వస్తువులన్నీ భారత్లో తయారుచేసినవే. దీన్ని బట్టి చూస్తే ఉగ్రవాదులకు స్థానికంగా మద్దతు లభిస్తోందని అధికారులు భావిస్తున్నారు. 2011లో పార్లమెంట్ దాడిలో ప్రధాన నిందితుడైన అఫ్జల్ని దిల్లీలో 2013లో ఉరితీసిన సంగతి తెలిసిందే.
సొరంగం తవ్వి వచ్చారు
జమ్మూకాశ్మీర్లోని చమిల్యాల్ ప్రాంతంలో సొరంగాన్ని సరిహద్దు భద్రతా సిబ్బంది గుర్తించినట్లు బీఎస్ఎఫ్ డీజీ కేకే శర్మ వెల్లడించారు. దాని ద్వారానే ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించి నగ్రొటాలోని సైనిక శిబిరంపై దాడి చేసినట్లు భావిస్తున్నారు. ఇండియా టుడే కథనం మేరకు.. లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు రైలు పేల్చేందుకు లేదా, ఉరీ లాంటి ఉగ్రదాడిని జరిపేందుకు కుట్రలు పన్నినట్లు తెలిపారు.
చనిపోయిన ఉగ్రవాదుల దగ్గర రసాయన పదార్థాలు, పేలుడు పదార్థాలతో నిండిన సంచులు, ఆత్మాహుతి బెల్టులు లభ్యమయ్యాయి. ఆ ఉగ్రవాదులకు పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఎక్కువ సేపు దాడి చేసేందుకు ఎనర్జీ ట్యాబ్లెట్లు, ఎనర్జీ డ్రింక్స్, డ్రై ఫ్రూట్స్ వారు వెంట తెచ్చుకోగా వాటిని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు ఇండియా టుడే పేర్కొంది. మంగళవారం సాంబా సెక్టార్లోని రాంగఢ్ వద్ద పాక్ ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా వారిని సైన్యం తీవ్రంగా ప్రతిఘటించింది. యూరీ దాడి, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాతి నుంచి సరిహద్దులో వాతావరణం ఉద్రిక్తంగానే కొనసాగుతోంది.