18 నెలల ముందే నజీబ్ జంగ్ రాజీనామా: కేజ్రీతో వైరమే కారణమా
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గురువారం రాజీనామా చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామాను కేంద్రానికి పంపించారు. యూపీఏ హయాంలో 2013 జూలైలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఆమ్ అద్మీ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది.
మరో ఏడాదిన్నర పదవీ కాలం ఉండగానే నజీబ్ జంగ్ రాజీనామా చేయడం గమనార్హం. ఇది ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వంతో పడకపోవడం వల్లే రాజీనామా చేసి ఉండవచ్చునని అంటున్నారు. ఐఏఎస్ అధికారి అయిన నజీబ్ జంగ్ విద్యా రంగంలో సేవలు అందించారు.
గతంలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్గా పని చేశారు. తిరిగి ఆయన విద్యారంగానికి వెళ్లనున్నారు. తన పదవీ కాలంలో తనకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ధన్యవాదాలు తెలిపారు. 18 నెలల ముందు నజీబ్ జంగ్ రాజీనామా చేశారు.