మాట తప్పిన మోడీ.. ఎక్కడ ఆ హామి!, రైతులకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వరా?
ఆఖరికి మల మూత్రాలను సేవించడానికి కూడా సిద్దపడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు.
న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చేదాక ఒకలా.. వచ్చాక మరొకలా! రాజకీయ నాయకుల లక్షణమే అంత. అధికారం రాగానే ప్రజలు మాటలు చెవికెక్కవు. ఎన్నికల హామిలు గుర్తుండవు. కళ్లెదుటే విస్మయపరిచే రీతిలో నిరసన తెలుపుతున్నా.. వారికి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరు.
ప్రధాని మోడీని ఉద్దేశించి తమిళనాడు రైతులంతా ప్రస్తుతం ఇదే గుర్తు చేసుకుంటున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో రైతుల తలసరి ఆదాయం పెంచుతానని మాటిచ్చిన మోడీ.. బొత్తిగా ఆ మాటనే మరిచిపోయినట్లున్నారు. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా ఒక్క ప్రయత్నమూ జరగలేదు.
కేంద్రం స్పందించకపోతే.. 'మా మూత్రం మేమే తాగుతాం': తమిళ రైతుల నిరసన
ఈ నేపథ్యంలోనే తమిళనాడు రైతులంతా కరువు నిధుల కోసం ఢిల్లీలో ఆందోళన చేస్తూ వస్తున్నారు. వారి ఆందోళనకు తలొగ్గి రూ.2వేల కోట్లు విడుదల చేసినా.. అవి ఏ మూలకు సరిపోవనేది రైతుల వాదన. మరిన్ని నిధులు విడుదల చేయాలంటూ తమ నిరసనను కొత్త పుంతలు తొక్కించారు.
ఆఖరికి మల మూత్రాలను సేవించడానికి కూడా సిద్దపడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. వారి గోడు వినేందుకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రైతులతో మాట్లాడినా.. ఎలాంటి హామి ఇవ్వలేదు.
చివరకు సీఎం పళనిస్వామి ఇచ్చిన భరోసాతో ఆదివారం నాడు వారు తాత్కాళికంగా ఆందోళనను విరమించుకున్నారు. కాగా గత ఆరు నెలల కాలంలో తమిళనాడులో 150మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో అప్పులు తీర్చే దారిలేక వీరంతా ఈ చర్యకు ఒడిగట్టారు. ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా రైతులందరి రుణాలు మాఫీ చేయాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పంట రుణాలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరను పెంచి, ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కరువు నిధులతో పాటు కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరీ జలాల పంపిణీ కోసం కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం మాత్రం ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు.