మోడీ మైండ్ గేమ్: 'అద్వానీ'ని భలే ఇరికించేశాడే!, ఇంత ప్లాన్ జరిగిందా?
పొమ్మనలేక పొగ పెట్టినట్లు.. ఎటూ ఇప్పుడు బాబ్రీ కేసు అద్వానీ మెడకు ఊగిసలాడుతుంది కాబట్టి రాష్ట్రపతి పదవిలో ఆయన్ను కూర్చోబెట్టడం అయ్యే పనికాదు.
న్యూఢిల్లీ: రాజకీయమంటేనే ఆధిపత్య పోరు.. ప్రత్యర్థులను నిలువరించడానికి ఊపిరి సలపని వ్యూహాలు రచించడమే కాదు, ఏమాత్రం ప్రతికూలంగా ఉన్నా సొంతగూటి నేతల పైనే రాజకీయ అస్త్రాలు ప్రయోగించడం.. రాజకీయ నీతిలో ఆరితేరిన 'మోడీ' లాంటి వ్యక్తులకే చెల్లు.
లేకపోతే అద్వానీ లాంటి నేతలు సైతం మోడీ ముందు నిస్సహాయంగా నిలబడాల్సిన పరిస్థితేంటి?. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా సుప్రీం నుంచి అద్వానీకి ప్రతికూలంగా తీర్పులు వస్తున్నాయంటే.. దీని వెనుక మోడీ మైండ్ గేమ్ ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.
వాస్తవానికి అద్వానీని రాష్ట్రపతిని చేయడం ప్రధాని మోడీకి ఏమాత్రం ఇష్టం లేదు. అలా అని ఆ విషయాన్ని బహిర్గత పర్చలేడు. పైకి మాత్రం అద్వానీ పట్ల ప్రేమ చూపిస్తూనే.. లోలోపల చేయాల్సిందల్లా చేసేశాడు. సీబీఐ ప్రభుత్వ కనుసన్నుల్లోనే నడుస్తున్నా.. అద్వానీకి ప్రతికూలంగా వ్యవహరించడం కచ్చితంగా మోడీ చొరవే అన్నది చాలామంది అభిప్రాయం.
పొమ్మనలేక పొగ పెట్టినట్లు.. ఎటూ ఇప్పుడు బాబ్రీ కేసు అద్వానీ మెడకు ఊగిసలాడుతుంది కాబట్టి రాష్ట్రపతి పదవిలో ఆయన్ను కూర్చోబెట్టడం అయ్యే పనికాదు. అద్వానీ సైతం తన విశాల నేత్రాలతో తన వెనకాల ఏం జరుగుతుందో గ్రహించేశాడు. కాబట్టే, రాష్ట్రపతి రేసులో తాను లేనని ప్రకటించేశాడు. తప్పదు మరి!, మొండిగా ముందుకెళ్తే.. మోడీ ముందు ధీటుగా నిలబడలేని పరిస్థితి.
ఒక్క అద్వానీనే కాదు.. ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాడు మోడీ. మనోహర్ పారికర్ లాంటి సీనియర్ నేతను గోవాకే పరిమితం చేసేశాడు. రాజ్ నాథ్ సింగ్ ను సైతం యూపీకే పరిమితం చేయాలని ప్రయత్నించినప్పటికీ.. సంఘ్ పరివార్ జోక్యంతో అది కుదరలేదు.
బాబ్రీ కేసులో నిందితులుగా ఉన్న మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి లాంటి వాళ్ల మోడీకి వచ్చిన ముప్పేమి లేదు. ఇక యోగి ఆదిత్యనాథ్ పేరు మోడీకి ధీటుగా వినిపిస్తున్నా.. ఇప్పుడప్పుడే ఆయన వల్ల మోడీకి వచ్చిన నష్టం లేదు. కాబట్టి పార్టీలో తనకు ఎదురు నిలిచే వ్యక్తులందరిని మోడీ ఇలా క్లియర్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారన్నమాట.