10 రోజుల్లో పంచ్, పాక్ను ఇలా వరుసగా కార్నర్ చేసి..: దటీజ్ మోడీ
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోకి వెళ్లి ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిట్స్ దాడి జరిపింది. దీనిపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మేం వేరే దేశం పైన దాడికి దిగితే దురాక్రమణ అవుతుందని, మా భూభాగంలోనే సర్జికల్ స్ట్రయిట్స్ నిర్వహించామని సైన్యం ప్రకటించింది.
తమ దేశ భూభాగంలో ఉగ్రవాదులు తిరిగితే చూస్తూ ఊరుకోమని భారత్ తెలిపింది. భారత్కు చెందిన భూభాగంలో సర్జికల్ స్ట్రయిక్స్ జరిపేందుకు భారతకు చట్టబద్ధమైన అవకాశముందని ప్రకటించారు. కాగా, యూరీ ఘటన నుంచి సర్జికల్ స్ట్రయిట్స్ వరకు భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అంటున్నారు.
ఓ వైపు అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ను ఏకాకి చేసిన మోడీ ప్రభుత్వం, ఆ తర్వాత యూరీ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని భారత ప్రజానీకానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. యూరి దాడి జరిగినప్పటి నుంచి ప్రధాని మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు.
11 రోజుల్లో..
ఘటన జరిగిన పదకొండు రోజుల్లో భారత ప్రభుత్వం దెబ్బకు దెబ్బ కొట్టింది. భారత సైన్యం సరిహద్దుల్లో పొంచి ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టి పాకిస్థాన్కు హెచ్చరికలు చేయడమే కాకుండా గట్టి సమాధానం ఇచ్చింది.
యూరి దాడి అనంతరం తొలుత ప్రపంచంలో పాక్ను ఏకాకిని చేయడంలో మోడీ ప్రభుత్వం సఫలమైంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ పాకిస్థాన్పై మండిపడింది. ఉగ్రవాదులు పాక్ నుంచే భారత్లోకి ప్రవేశించారంటూ ఆధారాలు చూపించింది. భారత్ ఆరోపణలను ఖండిస్తూ వచ్చిన పాకిస్థాన్కు భారత్ ఐరాసలోనూ గట్టి సమాధానమే ఇచ్చింది.
భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఐరాస అసెంబ్లీలో పాక్ తీరును ఎండగట్టారు. పాక్ను ఉగ్రవాద దేశంగా పరిగణించాలని గట్టిగా చెప్పారు. అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐరాస సమావేశాల్లో కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని చేసిన విజ్ఞప్తిని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ తిరస్కరించారు. దీనిని భారత్-పాక్లు చర్చించుకుని పరిష్కరించుకోవాలన్నారు. యూరీ ఘటన పైన అమెరికా, బంగ్లాలు కూడా పాక్ పైన మండిపడ్డాయి.
సింధు జలాలపై తర్జన
పాక్-భారత్ల మధ్య ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని ప్రధాని మోడీ సమీక్షించి సాధ్యమైనంత ఎక్కువ నీటిని భారత్ వాడుకునేలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని సూచించారు. దీంతో పాక్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అలాగే పాకిస్థాన్కు ఇరవయ్యేళ్ల క్రితం కల్పించిన అత్యంత ప్రాధాన్య దేశం హోదాను పునస్సమీక్షించాలని నిర్ణయించారు.
సార్క్తో పాక్కు మరో గట్టి దెబ్బ
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలని భారత్ వెల్లడించింది. సార్క్ సమావేశాల విషయంలో ప్రధాని మోడీ అది చేసి చూపించారు. నవంబరులో పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో జరగనున్న సార్క్ సమావేశాలకు మోడీ తాను హాజరుకానని వెల్లడించారు.
అంతేకాదు ఇతర దేసాల మద్దతు సంపాదించారు. భారత్కు మద్దతుగా సార్క్ సమావేశాలకు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, భూటాన్ దేశాలూ హాజరుకావట్లేదని ప్రకటించాయి. దీంతో సమావేశాలు వాయిదా పడే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలోనూ మోడీ విజయం సాధించారు. ఇప్పుడు సర్జికల్ స్ట్రయిట్ దాడితో ఇంటా, బయట గెలిచారు.