గాంధీని కాదు నెహ్రూను చంపాల్సింది!: వివాదాస్పదం
ఎర్నాకుళం: జాతిపిత మహాత్మా గాంధీకి బదులుగా భారత విభజనకు కారకుడైన జవహర్ లాల్ నెహ్రూనే అప్పట్లో నాధూరాం గాడ్సే చంపేసి ఉండాల్సిందని ఆరెస్సెస్ పత్రిక 'కేసరి' మలయాళ సంచికలో ప్రచురించిన వ్యాసం వివాదాస్పదమైంది. దీంతో ఆరెస్సెస్ దీనిని ఖండించింది. దీనిపై వివరణ ఇచ్చింది.
అక్టోబర్ 17వ తేదీ కేసరి మలయాళ సంచికలో ప్రచురించిన వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు కేవలం ఆ రచయితవి మాత్రమేనని, తమకు ఎలాంటి సంబంధం లేదని ఆరెస్సెస్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరెస్సెస్ జాతీయ ప్రచార ప్రముఖ్ మన్మోహన్ వైద్య శనివారం ప్రకటన విడుదల చేశారు.
ఆరెస్సెస్ ఏ రకమైన హింసను కూడా ప్రోత్సహించదన్నారు. ఇలాంటి పోకడలకు పూర్తి వ్యతిరేకమన్నారు. ఈ వ్యాసాన్ని కేరళలోని కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది. చరిత్రను వక్రీకరించిన ఈ వ్యాసం ఏమాత్రం సమర్థనీయం కాదని, ఇందుకు మూలకారణం ఆరెస్సెస్, బీజేపీలేనని మండిపడింది.
దీని పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అభిప్రాయాన్ని చెప్పాలని డిమాండ్ చేసింది. కేసరిలో ప్రచురించిన వ్యాసం అనారికమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ అన్నారు. ఈ వ్యాసం పైన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
భారత చరిత్రను తిరగరాయడం మొదలైందా ఏంట, దీనిపై బీజేపీ, ఆరెస్సెస్, ప్రధాని మోడీ కూడా ప్రకటన చేయాలని ట్వీట్ చేశారు. అయితే, అలాంటిది జరగదని తనకు తెలుసునని ముగింపు ఇచ్చారు. ఇదే సమయంలో డిగ్గీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పైన నిప్పులు చెరిగారు. గడ్కరీ ఏకంగా హెల్మెట్ లేకుండానే స్కూటర్ నడపటం ద్వారా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించారన్నారు.
కాగా, దేశ విభజనకు అసలు కారకుడు నెహ్రూయేనని ఆరోపిస్తూ గత ఎన్నికల్లో కేరళలోని చలాకుడి లోకసభ నియోజకవర్గం నుండి బీజేపీ తరఫున పోటీ చేసిన బీ గోపాలకృష్ణన్ కేసరీలో ఈ వ్యాసం రాశారు. గాడ్సేకు గాంధీ, ఆయన విధానాల పైన ఎంతో విశ్వాసం ఉందని, దేశ విభజనకు గాంధీయే కారణమని పొరబడ్డారని అందులో పేర్కొన్నారు.
దేశ విభజనకు ముందు గాడ్సే వైఖరి ఎలా ఉండేదో చరిత్ర విద్యార్థులు ఎవరైనా నిజాయితీగా అంగీకరిస్తారని, వారందరు ఆయన తప్పుడు లక్ష్యాన్ని ఎంచుకున్నారని భావిస్తారని, ఆయన గాంధీని చంపి ఉండాల్సింది కాదని, దేశాన్ని విభజించింది నెహ్రూయేనని పేర్కొన్నారు. కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. అయితే, తన కథనానికి కట్టుబడి ఉన్నానని వ్యాసకర్త గోపాలకృష్ణన్ పేర్కొన్నారు.