ఐఎన్ఎస్ సంధాయక్లో అధికారిపై జూనియర్ల దాడి: హెలికాప్టర్తో వెంబడించిన నేవీ
భారత నేవీకి చెందిన సర్వే షిప్ ఐఎన్ఎస్ సంధాయక్పై నలుగురు నావికులు.. ఓ నేవీ అధికారికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సంధాయక్ ఒడిశా తీరంలో ఉండగా నలుగురు నావికులు..
న్యూఢిల్లీ: భారత నేవీకి చెందిన సర్వే షిప్ ఐఎన్ఎస్ సంధాయక్పై నలుగురు నావికులు.. ఓ నేవీ అధికారికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సంధాయక్ ఒడిశా తీరంలో ఉండగా నలుగురు నావికులు.. ఓ సీనియర్ నేవీ అధికారిపై దాడి చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... సంధాయక్లోని నేవీ అధికారి ఆదేశాలను నావికులు సరిగ్గా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు.
ఆ నలుగురు నావికులను సదరు అధికారి సర్వే మోటార్ పడవలను తీయమన్నారు. అలాగే నలుగురు నావికులను అటెన్షన్లో నిలబడమని చెప్పగా.. ఒకరు నిర్లక్ష్యంగా సరిగ్గా నిలబడలేదు. దీంతో ఆ అధికారి అతడిని సరిగ్గా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన నావికుడు అధికారిపై చేయి చేసుకున్నట్లు సమాచారం.
ఆ సమయంలో మిగతా నావికులు కూడా అతడితో కలిసి అధికారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి పరిస్థితి అదుపు చేసే ప్రయత్నం చేశారు. హెలికాప్టర్ను పిలిపించి నలుగురు నావికులను నావపై నుంచి పంపించేశారు. ఆ నలుగురు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోనున్నారు. ఈ ఘటనపై ఓ దర్యాప్తు బృందం ఇప్పటికే విచారణ ప్రారంభించింది.
ఇలాంటి చర్యలను నేవీ సహించబోదని, తాము క్రమశిక్షణ విషయంలో ఉన్నత స్థాయి ప్రమాణాలను పాటిస్తామని నేవీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఘటన అనంతరం ఐఎన్ఎస్ సంధాయక్ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది. సంధాయక్ సముద్ర ఉపరితలంపై, సముద్ర గర్భంలోనూ సర్వే నిర్వహించి సమాచారం సేకరిస్తుంది. కాగా, సంధాయక్ 2001లో నేవీలో చేరింది.