నీట్ ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీం
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ ఫలితాల విడుదలకు గల అడ్డంకులు తొలగిపోయాయి.
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్) ఫలితాల విడుదలకు గల అడ్డంకులు తొలగిపోయాయి. ఫలితాల విడుదలను నిలిపివేయాలని గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో నీట్ ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది.
నీట్ ఫలితాలను నిలిపివేయాలని గతంలో మద్రసు హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. తమిళ, ఆంగ్ల భాషల ప్రశ్నాపత్రాల మధ్య తేడా ఉందని, అందువల్ల పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అక్కడి విద్యార్థులు కొందరు మద్రాసు హైకోర్టును ఆశ్రయించడంతో ఫలితాల విడుదలను నిలిపివేయాలని తీర్పు చెప్పింది.
దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఎస్ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీఎస్ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. మద్రాసు హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. నీట్ ఫలితాలను ప్రకటించాలని సీబీఎస్ఈని ఆదేశించింది. అంతేగాక, నీట్ అడ్మిషన్ల షెడ్యూల్ ను ప్రభావితం చేసే పిటిషన్లను హైకోర్టులు విచారించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.