శిధిలాల కింద 105 ఏళ్ల వృద్ధుడు, దెబ్బతిన్న స్వయంభూనాథ్ స్థూపం
న్యూఢిల్లీ: నేపాల్ భూకంప తాకిడికి ఎనిమిది రోజులు పాటు తమ ఇంటి శిథిలాల కిందే కూరుకుపోయి సజీవంగా ఉన్న నలుగురు వ్యక్తులను సహాయక బృందాలు ఆదివారం సురక్షితంగా వెలికితీశారు. ఇందులో విశేషం ఏమిటంటే కింటాంగ్ గ్రామానికి చెందిన ఫంఛూఘాలే అనే 105 ఏళ్ల వృద్ధుడు ఎనిమిది రోజుల నుంచి తన ఇంటి శిధిలాల కిందే సజీవంగా ఉండటం సహాయక చర్యలు చేపడుతున్న బృందాలను ఆశ్చర్యచకితులను చేసింది. ప్రాణాలతో ఉండడంతో కాపాడి అతడిని ఆస్పత్రికి తరలించారు.
చిన్న చిన్న గాయాలతో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తూర్పు నేపాల్ ప్రాంతంలోని మాకాలూ బేస్ క్యాంప్ వద్ద చిక్కుకున్న 12 మంది పర్వతారోహకులను ఆదివారం పోలీసులు రక్షించి హెలికాప్టర్లలో ఖాఠ్మండుకు తరలించారు.
ఇక లాంగ్ టాంగ్ పర్వతారోహణ మార్గంలో శిధిలాల కింద నుంచి నేపాల్ పోలీసులు 51 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో ఆరుగురి విదేశీయులున్నారు. ఈ ప్రాంతంలో సుమారు వంద మంది వరకు విదేశీయలు గల్లంతైనట్లు వార్తులు వినిపిస్తున్నాయి.
దీంతో నేపాల్ భూకంప తాకిడి బలైపోయిన వారి సంఖ్య 7,200కు చేరింది. 14,277 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల తొలగింపు సహాయక చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి. ఐదు రోజులుగా పలుచోట్ల వరుస స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
నేపాల్ భూకంపంలో స్వయంభూనాథ్ స్థూపం పూర్తిగా దెబ్బతింది. ప్రపంచంలోనే అతి పురాతనమైన కట్టడంగా ఈ స్థూపానికి పేరుంది. టార్పాలిన్లపై నేపాల్ దిగుమతి పన్ను రద్దు చేసింది. నేపాల్లోని ప్రధాన విమానాశ్రయంలో రన్వే దెబ్బతినడంతో త్రిభువన్ ఎయిర్పోర్టును మూసివేశారు.
నేపాల్ భూకంపానికి దెబ్బతినడంతో త్రిభువన్ విమానాశ్రయానికి మరమ్మతులు చేసి చిన్న, మద్యతరహా విమానాలు మాత్రమే దిగేందుకు అనుమతిస్తున్నట్లు సంబంధిత అధికారి బీరేంద్ర శ్రేష్ఠ తెలిపారు. పెద్ద విమానాలకు అనుమతి ఇవ్వడం లేదని ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి.
నేపాల్కు సాయం చేసేందుకు వస్తున్న పెద్ద విమానాలను త్రిభువన్ విమానాశ్రయంలో దిగేందుకు అనుమతించడం లేదు. ఇప్పటి వరకు నేపాల్లో భూకంప వల్ల సుమారు లక్ష వరకు ఇళ్లు నేలమట్టమైనట్లు ఐక్యరాజ్య సమితి అధికారికంగా వెల్లడించింది.