మేమున్నాం: నేపాల్కు మోడీ, డ్రోన్ల ద్వారా వీడియో చిత్రీకరణ
న్యూఢిల్లీ/ఖాట్మాండ్: నేపాల్లో భవనాల పునర్మిర్మాణానికి సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. శిథిలమైన ప్రాంతాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చిత్రీకరిస్తున్నాయని చెప్పారు. మానవ రహిత విమానం ద్వారా దృశ్యాల చిత్రీకరణ జరుగుతోందన్నారు. ఆ దృశ్యాలను పరిశీలించి తగురీతిలో సహాయసహకారాలు అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
మరోవైపు, సామాజిక అనుసంధాన వేదికల్లో మోడీపై ప్రశంసలు కురుస్తున్నాయి. నేపాల్లో భూకంపంపై భారత ప్రభుత్వం, ప్రధాని మోడీ స్పందించిన తీరు పైన సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. 'థ్యాంక్యూ పీఎం' అంటూ కితాబిస్తున్నారు.
అంతకుముందు, భూకంప మృతుల సంఖ్య పదివేలకు పైగానే ఉండవచ్చునని నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా మంగళవారం చెప్పారు. సహాయక చర్యలు అవసరమైన స్థాయిలో జరగడం లేదని అంగీకరించారు. ఇప్పటికే మృతుల సంఖ్య దాదాపు అయిదువేలకు చేరిందన్నారు. ఈ ఘటనలో ఎనిమిదివేల మంది గాయపడ్డారని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
మందులు, టెంట్లను పంపించి తమను ఆదుకోవాలని ఆయన భారత్ను, ఇతర దేశాలను కోరారు. నేపాల్ రాజధాని ఖాట్మండ్లో భూకంప బీభత్సాన్ని మానవరహిత విమానం ద్రోణ్ నుంచి చిత్రీకరించారు. చారిత్రక భవనాలు నేలమట్టమయ్యాయి. సగం కూలిన భవనాలు, ఇళ్లలోకి వెళ్లేందుకు ధైర్యం చాలక ప్రజలు గుంపులుగా రోడ్లమీదే తిరుగుతున్నారు. పర్యాటక ప్రదేశాలు ఆనవాళ్లు లేకుండా పోయాయి.
కొన్ని గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాయి. భూకంపానికి కొండరాళ్లు దొర్లుకుంటూ ఊళ్లమీద పడ్డాయి. దాంతో గ్రామాల్లోకి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వైద్య బృందాలు అక్కడికి కాలినడకనే చేరుకుంటూ క్షతగాత్రులకు సేవలు అందిస్తున్నాయి. కొన్నిచోట్ల సాయం అందించలేని పరిస్థితి. సోమవారం రాత్రి కూడా స్వల్పంగా భూమి కంపించింది.