భూకంపం: మీ దేశాలకు వెళ్లిపోండన్న నేపాల్, భారత్ను కాదని వివరణ
ఖాట్మాండ్: భూకంపం నేపథ్యంలో భారత్ సహా మరో 33 దేశాల నుండి వెళ్లిన విపత్తు సహాయక బృందాలను వెళ్లిపోవాల్సిందిగా నేపాల్ ప్రభుత్వం కోరింది. 34 దేశాల నుండి వచ్చిన విపత్తు బృందాలను ఉపసంహరించుకోవాలని కోరామని, ప్రస్తుతం తమ దృష్టి కాపాడటం నుండి సహాయక చర్యల పై మరల్చినట్లు నేపాల్ విదేశాంగ శాఖ తెలిపింది. ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటుందని చెప్పారు.
అయితే, తాము చెప్పింది భారత్ను ఉద్దేశించి కాదని నేపాల్ వివరణ ఇచ్చింది. భారత్ పునరావాస ప్రక్రియలో కొనసాగుతుందని భారత్లో నేపాల్ దేశ రాయబారి దీప్ కుమార్ ఉపాధ్యాయ చెప్పారు. భూకంపం సంభవించిన ఆరేడు గంటల్లో అవసరమైన పరికరాలన్నింటిలో భారత విమానం ఖాట్మాండులో దిగిందని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు.
కాగా, భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహయ చర్యల్లో పాల్గొంటున్న భారత్కు చెందిన జాతీయ విపత్తు స్పందన దళాలను, తమ కార్యక్రమాలకు స్వస్తి పలకాలని నేపాల్ కోరింది. భారత్ తోపాటు మరో 33దేశాలకు చెందిన సహాయక దళాలు ఇక్కడ సహాయక కార్యక్రమాలను చేపట్టాయి. భారత్ తోపాటు వాటన్నిటినీ సహాయక కార్యక్రమాలు ముగించికుని త్వరలో వెళ్లిపోవాలని కోరింది. అనంతరం భారత్ పైన వివరణ ఇచ్చింది.
ఇదిలా ఉండగా, శిథిలాల్లో ప్రాణాలతో ఉన్న వారు దొరికే అవకాశాలు సన్నగిల్లడంతో.. ఆపరేషన్ చివరికొచ్చిందని ఎన్డీఆర్ఎఫ్ అధిపతి ఓపీ సింగ్ చెప్పారు. దశలవారీగా సిబ్బంది ఉపసంహరణ ప్రారంభించామన్నారు. సహాయక, పునరావాస బృందాలు తమ విధులు నిర్వర్తిస్తాయన్నారు. నేపాల్ సర్కారు శిథిలాలు తొలగించేందుకు భారీ యంత్రాలు కోరిందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు.