నాకంటే ముందే మోడీ స్పందించారు: నేపాల్ భూకంపంపై రాజ్
న్యూఢిల్లీ: నేపాల్తో పాటు ఉత్తర, ఈశాన్య భారతదేశాన్ని వణికించిన భూకంపై పైన తన కంటే ముందే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం అన్నారు. భూకంపై పైన ఆయన పార్లమెంటులో ప్రకటన చేశారు.
వార్త తెలిసిన నిమిషాల్లోనే ప్రధాని మోడీ తనను అప్రమత్తం చేశారన్నారు. తనకంటే ముందే ఆయన విషయం తెలుసుకున్నారని, తక్షణే రంగంలోకి దిగారని, అది తనకు చాలా సంతోషం కలిగించిందన్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారన్నారు.
నేపాల్లో చిక్కుపోయిన భారతీయులను తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. భూకంపం బారిన పడ్డ దేశ ప్రజలను, నేపాల్లోని భారతీయులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. బీహార్, ఉత్తర ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సేవలు అందిస్తున్నాయన్నారు. మోడీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్నారు.
భూకంపం వల్ల దేశంలో 72 మంది మృతి చెందారన్నారు. బీహార్కు 4, యూపికి 1 ఎన్డీఆర్ఎఫ్ బృందం వెళ్లిందన్నారు. నేపాల్ నుండి భారత్ వచ్చేందుకు విదేశీయులకు అత్యవసర వీసా ఇచ్చామన్నారు. కాగా, భారత సహాయక బృందాలకు ప్రధాని మోడీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.