నేపాల్ భూకంపం షాకింగ్: తగ్గిన ఎవరెస్ట్ పర్వతం ఎత్తు
ఖాట్మాండ్: నేపాల్ భూకంపం నేపథ్యంలో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. గత నెల 25వ తేదీన నేపాల్లో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఇది రిక్టర్ స్కేల్ పైన 7.9గా నమోదయింది. ఈ భూకంపం కేవలం ప్రజలను మాత్రమే వణికించలేదు. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం కూడా దీని ప్రభావానికి గురైంది.
యూరోప్కు చెందిన సెంటినల్ -1ఏ రాడర్ శాటిలైట్ ఓ కొత్త విషయాన్ని చెప్పింది. భూకంపం ధాటికి ఎవరెస్ట్ పర్వతం 2.8 సెంటీమీటర్ల మేర కుంగిపోయింది. ఇదే విషయాన్ని యూఎన్ఏవీసీఓ అనే నాన్ ప్రాఫిట్ జియో సైన్స్ రీసెర్ట్ కన్సార్టియం కూడా ధృవీకరించింది.
అదే సమయంలో ఖాట్మాండు సమీపంలో 120 కిలోమీటర్ల పొడవు, 50 కిలోమీటర్ల వెడల్పులో ఒక మీటర్ పెరిగింది. శాటిలైట్ ఫుటేజీ తదితరాలను శాస్త్రవేత్తలు పరిశీలించి మరిన్ని విషయాలు చెప్పనున్నారు.
కాగా, నేపాల్ భూకంపం నేపథ్యంలో ఏడువేల మందికి పైగా ప్రజలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికీ చాలామంది ఆచూకీ దొరకడం లేదు. చాలామంది ఇంకా శిథిలాలు, రాళ్లు, రప్పల కింద ఉండి ఉంటారని భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలు సౌత్ ఏషియా, యూరోపియన్ దేశాలు సహాయక సామాగ్రిని పంపించాయి.