నేపాల్ భూకంపం: ఇద్దరు తెలంగాణ, 7గురు ఒరిస్సా వాసుల మృతి
ఖాట్మాండ్/హైదరాబాద్: నేపాల్లో సంభవించిన భారీ భూకంపంలో ఇద్దరు తెలంగాణవాసులు మృతిచెందారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మండలం ఆర్కేపురి కాలనీకి చెందిన తిమ్మరస్వామి(22) కొంతకాలంగా నేపాల్నే ఉంటున్నారు. ఇక్కడి నుంచి దాదాపు 500 బుడగజంగాల కుటుంబాలు నేపాల్ వలస వెళ్లి అక్కడే నివసిస్తున్నాయి.
శనివారం సంభవించిన భారీ భూకంపంలో చిక్కుకున్న తిమ్మరస్వామితోపాటు మరో ఐదు నెలల చిన్నారి అంబిక మృతి చెందింది. మృతి వార్త తెలియడంతో వారి స్వగ్రామం ఆర్కేపురి కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఖాట్మాండులో గల్లంతైన పాల్వంచ వాసులు పిల్లి సత్యనారాయణ, భార్య ఉమాదేవి, తండ్రి కొమరయ్య క్షేమంగా ఉన్నారు. నేపాల్ నుంచి వారు భారత్ బయలుదేరినట్టు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
ఏడుగురు అస్సాం మహిళలు మృతి
నేపాల్కు తీర్థయాత్రకు వెళ్లిన అస్సాంకు చెందిన ఏడుగురు మహిళలు మృతి చెందారు. శనివారం నేపాల్లో సంభవించిన భారీ భూకంపం కారణంగా వీరు ప్రాణాలు కోల్పోయారు. మహిళల మృతదేహాలను గౌహతికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అస్సాంకు చెందిన కేంద్రమంత్రి శరవానంద సోనోవాల్ తెలిపారు.
నేపాల్లో చిక్కుకున్న 100మంది కేరళవాసులు
నేపాల్ భూకంప ప్రమాదంలో 100మంది కేరళీయులు చిక్కుకున్నట్లు కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ సోమవారం ప్రకటించారు. రాష్ట్రమంత్రి కెసి జోసెఫ్.. కేరళీయులను స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టడానికి ఢిల్లీ వెళ్లినట్లు తెలిపారు. నేపాల్లో సేవలందిస్తున్న భారత సహాయ బృందాలకు చాందీ అభినందనలు తెలిపారు.