ఉగ్రవాదులు, పట్టిస్తే రూ. 10 లక్షలు (ఫోటోలు)
న్యూఢిల్లీ/బెంగళూరు: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న నిందితులను పట్టుకోవడానికి ప్రజలు సహకరించాలని నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు మనవి చేశారు. అధికారులు ఉగ్రవాదుల ఫోటోలను విడుదల చేశారు.
నిందితుల ఆచూకీ చెప్పిన వారికి, వారిని పట్టించిన వారికి రూ. 10 లక్షలు బహుమానం అందిస్తామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. 2014 డిసెంబర్ 28వ తేది రాత్రి 8.10 గంటలకు బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డు సమీపంలోని చర్చిస్ట్రీట్ దగ్గర జరిగిన బాంబు పేలుళ్ల కేసు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జైలు నుండి సినిమా ఫక్కిలో ఉగ్రవాదులు తప్పించుకున్నారు. వీరిలో ఇద్దరు ఉగ్రవాదులు కొన్ని నెలల క్రితం తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్ లో అంతం అయ్యారు.
మిగిలిన నిందితులు దక్షిణ భారతదేశంలోనే తలదాచుకున్నారని ఇంటిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చాయి. అంతే కాకుండ కొంత కాలం క్రితం వీరు బెంగళూరు చేరుకుని అక్కడి నుండి మాయం అయ్యారని అధికారులు అంటున్నారు.
జైలు నుండి తప్పించుకున్నారని, బెంగళూరులోని చర్చిస్ట్రీట్ లో బాంబు పేలుడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణలో దోపిడీలు చేశారని కేసులు నమోదు అయ్యాయి, నిందితుల ఆచూకి చెప్పిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని, రూ. 10 లక్షలు బహుమానం అందిస్తామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
వీరే ఆ ఉగ్రవాదులు!
2013 అక్టోబర్ 1వ తేదిన మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జైలు నుండి ఉగ్రవాదులు షేక్ మహబూబ్, అజ్మద్ ఖాన్, సాలిక్, జాకీర్ తదితరులు తప్పించుకున్నారు. ఈ నలుగురు ఎన్ఐఏ అధికారుల మోస్ట్ వాంటెండ్ జాబితాలో ఉన్నారు. నిందితులను పట్టుకోవడానికి ఎన్ఐఏ అధికారులు ప్రజల సహాయం తీసుకుంటున్నారు.