కండెక్టర్పై దాడి చేసిన విదేశీ మహిళలు
బెంగళూరు: డైలీ పాస్ మీద సంతకం చెయాల్సిందిగా చెప్పిన బీఎంటీసీ బస్సు కండెక్టర్ మీద దాడి చేసిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. కండెక్టర్ మీద దాడి చేసిన నలుగురు విదేశీ మహిళల మీద బెంగళూరులోని విల్సన్ గార్డెన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బీఎంటీసీ బస్సులలో డైలీ పాస్ లు విక్రయిస్తారు. ఈ పాస్ లు తీసుకున్న ప్రయాణికులు బీఎంటీసీ బస్సులలో ఎక్కడి నుండి ఎక్కడికైనా రాత్రి 12 గంటల వరకు సంచరించడానికి అవకాశం ఉంది. అయితే పాస్ లు తీసుకున్న వారు కచ్చితంగా అందులో సంతకం చెయ్యవలసి ఉంటుంది.
ఆదివారం మెజస్టిక్ నుండి ఆనేకల్ ప్రాంతానికి రూట్ నెంబర్ 366 బస్సు బయలుదేరింది. ఆ బస్సులో నైజీరియాకు చెందిన ఆరుగురు మహిళలు ప్రయాణించారు. మార్గం మధ్యలో బస్సు కండెక్టర్ దేవేగౌడ పాస్ లు పరిశీలించారు. అందులో సంతకం చెయ్యాలని నైజీరియా మహిళలకు చెప్పాడు.
తరువాత వారి మధ్య వాగ్వివాదం జరిగింది. సహనం కొల్పోయిన మహిళలు కండెక్టర్ మీద దాడి చేశారు. విషయం తెలుసుకున్న కండెక్టర్లు, సిబ్బంది విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
పోలీసులు నలుగురు మహిళల మీద కేసు నమోదు చేసి వారి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన కండెక్టర్ దేవేగౌడ విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.