సీఎం రేసులో లేను: గడ్కరీ, ఫడ్నవీస్ వైపే మొగ్గు..!
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో తాను లేనని భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షడు, కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దీపావళి సందర్భంగా ఆయన ప్రకటించి, దేవేంద్ర ఫడ్నవీస్కు మార్గం సుగమం చేశారు.
గడ్కరీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేందుకు వీలుగా తాను రాజీనామా చేసి.. తన స్థానాన్ని ఆయనకు ఇచ్చేందుకు సిద్ధమని నాగ్పూర్ ఈస్ట్ ఎమ్మెల్యే కృష్ణా ఖోప్డే ప్రకటించడంతో... మహారాష్ట్ర సీఎం రేసులో నితిన్ గడ్కరీ పేరు కూడా ఉన్నపళంగా ముందు వరుసలోకి వచ్చింది.
అయితే, ఈ ప్రచారంపై ఆయన గురువారం స్పష్టమైన ప్రకటన చేశారు. మహారాష్ట్ర సీఎం బరిలో తాను లేనని, ఈ విషయాన్ని ఇదివరకే వెల్లడించానని కూడా ఆయన పేర్కొన్నారు. పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడిగా, రాష్ట్రంలో పార్టీకి కీలక నేతగా ఉన్న తనను పలువురు ఎమ్మెల్యేలు కలవడం సహజమని ఆయన వ్యాఖ్యానించారు. అంతమాత్రాన తాను సీఎం రేసులో ఉన్నానని అనుకోవడం సరికాదని ఆయన స్పష్టీకరించారు.
మంగళవారం మహారాష్ట్రకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు గడ్కరీని కలిసి సీఎం పీఠాన్ని అధిష్ఠించాల్సిందిగా అభ్యర్థించడం గమనార్హం. వాస్తవానికి సోమవారమే సీఎం అభ్యర్థిని నిర్ణయించేందుకు బీజేపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే, పొత్తులు కొలిక్కి రాకపోవడం.. అధిష్ఠానం, సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడంతో.. ఈ సమావేశానికి ఢిల్లీ పరిశీలకులు రాజ్నాథ్, జేపీనడ్డా హాజరుకాలేదు. దీంతో సీఎం ఎంపికను చేయాల్సిన సమావేశం బీజేపీ విజయోత్సవ సమావేశంగా ముగిసింది.
ఒకవైపు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక.. మరోవైపు పొత్తులపై చర్చలు జరుపుతూనే, సీఎం అభ్యర్థి ఎంపికపైనా బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. గడ్కరీ, ఫడ్నవీస్ ఇద్దరూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)కు కావల్సిన వారే. ఇద్దరూ నాగ్పూర్ వాసులే. అయితే, ఆరెస్సెస్ ముఖ్యులు.. గడ్కరీ కన్నా ఫడ్నవీస్ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఆరెస్సెస్ ఆశీస్సులతోనే గత ఏడాది మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరించారు.
288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 145కి కేవలం 23 స్థానాలు దూరంలో ఉన్న బీజేపీ.. సేన మద్దతు లేకపోయినా సర్కార్ మనుగడకు ఎలాంటి నష్టం ఉండదని భావిస్తున్నది. ఎన్సీపీ బేషరతుగా బయటినుంచి మద్దతు ప్రకటించడం, 15 మంది చిన్న పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కోసం ప్రయత్నిస్తుండటంతో సేన మద్దతు కోసం పాకులాడవద్దని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.