బోర్డు పిచ్చిదనుకుంటున్నావా: సైరస్ మిస్త్రీపై టాటా లాయర్ అభిషేక్
ముంబై: టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీ తొలగింపు సరైనదేనని రతన్ టాటా తరఫు లాయర్ అభిషేక్ సింఘ్వీ తెలిపారు. ఇది పూర్తిగా ఆర్థిక, నైతిక కారణాలపై తీసుకున్న చర్య అన్నారు. తన తొలగింపు అన్యాయమని మిస్త్రీ చేసినన ప్రకటనపై సంఘ్వీ స్పందించారు.
బోర్డు పిచ్చిదనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. ఆయన మీద బోర్డు నమ్మకం కోల్పోయిందని చెప్పారు. మొత్తం తొమ్మిది మంది ఉన్న బోర్డులో ఆరుగురు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు.
సైరస్ మిస్త్రీ కుటుంబ జీవితాన్ని త్యాగం చేశారు: సుప్రియా సూలే
ఇద్దరు హాజరు కాలేదన్నారు. ఆయనకు ఒక్క ఓటు కూడా రాలేదని చెప్పారు. కాగా, రతన్ టాటాతో అభిషేక్ రెండు గంటల పాటు భేటీ అయ్యారు. తొలగింపుపై న్యాయపరంగానే వ్యవహరించారని, దీనిని ప్రశ్నించలేరని టాటా గ్రూప్ సలహాదారు, ప్రముఖ లాయర్ హరీష్ సాల్వే అన్నారు.
కాగా, వారసత్వ సంస్థలను నష్టాల్లో నడుపుతున్న కారణంగా టాటా గ్రూప్ 18 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 1.18 లక్షల కోట్లు) రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుందని సైరస్ మిస్త్రీ చేసిన వ్యాఖ్యలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించగా, వరుసగా మూడవ రోజు కూడా టాటా గ్రూప్ కంపెనీల ఈక్విటీలు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిలో కూరుకుపోయాయి.
టాటా పవర్, టాటా కమ్యూనికేషన్స్, టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బీవరేజస్, టాటా కాఫీ, టాటా ఇన్వెస్ట్ మెంట్స్ కార్పొరేషన్, టాటా టెలీ సర్వీసెస్, టాటా మెటాలిక్స్, టాటా స్పాంజ్ అండ్ ఐరన్ కంపెనీలు నేడు 5 నుంచి 13 శాతం వరకూ నష్టాల్లో నడుస్తున్నాయి.
మిస్త్రీ బహిష్కరణ అనంతరం టాటా గ్రూప్ కంపెనీలకు ఇప్పటివరకూ రూ.40 వేల కోట్ల నష్టం సంభవించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 0.27 శాతం నష్టంలో కొనసాగుతుండగా, టాటా కంపెనీలు ఎన్నో రెట్ల నష్టాల్లోకి వెళ్లాయి. సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారిలో నెలకొన్న భయాందోళనలే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. గురువారం నాటి సెషన్లో ఇండియన్ హోటల్స్ సంస్థ అత్యధికంగా 13 శాతం పతనమైంది.