కేదార్నాథ్ ఆలయం సురక్షితం, గోడలు పటిష్టం: ఐఐటీ నిపుణులు
న్యూఢిల్లీ: చార్ధామ్ యాత్రలో ఒకటైన పవిత్ర కేదార్నాథ్ ఆలయానికి ఎటువంటి ప్రమాదం లేదని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. రెండేళ్ల క్రితం జలప్రళయంతో ఎత్తైన కొండల నుంచి బలంగా వచ్చిన వరదజోరులో పెద్ద పెద్ద బండరాళ్లు వేగంగా మందిరాన్ని తాకాయి.
దీంతో మందిర పటిష్ఠతను పరిశీలించి మరమ్మతు చేసేందుకు ఐఐటీ చెన్నై నిపుణుల బృందం క్షుణ్నంగా పరీక్షించింది. ఈ పరిశోధనల ఆధారంగా అంతటి భయంకరమైన వరదల్లోనూ దేవాలయ నిర్మాణానికి ఎలాంటి సమస్య రాలేదని తేల్చింది.
ఉత్తరాఖండ్లో 2013లో భీకరమైన వరదలు వచ్చినప్పటికీ హిమాలయాల్లోని కేదార్నాథ్ ఆలయం పునాదులు పెద్దగా దెబ్బతినలేదని ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం తేల్చింది. ఈ మేరకు భారత పురాతత్వ సంస్థ(ఏఎస్ఐ)కు ప్రాథమిక నివేదికను అంద జేసింది.
ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం ఈ ప్రాంతాన్ని మూడుసార్లు క్షుణ్ణంగా పరిశీలించి ప్రాథమిక నివేదికను అంద జేసిందని, ఆలయానికి పెద్దగా నష్టమేమీ జరగలేదని తేల్చిందని భారత పురాతత్వ సంస్థ అధికారులు చెప్పారు. క్రీపూ 8వ శతాబ్దంలో నిర్మించిన మందిరం పునాది, గోడల్లో పటిష్ఠత తగ్గలేదని స్పష్టం చేసింది.