తప్పులేదు, భయం అవసరం లేదు: మంత్రులకు మోడీ ధైర్యం
న్యూఢిల్లీ: మత మార్పిడుల పైన విపక్షాలు ఆరోపణలు చేస్తుండటంపై ప్రధాని నరేంద్ర మోడీ మంత్రులకు ధైర్యమిచ్చారని తెలుస్తోంది. మనం ఎలాంటి తప్పు చేయలేదని, భయపడాల్సిన పనిలేదని ఆయన వారికి సూచించారని సమాచారం. మత మార్పిడుల వ్యవహారంలో ప్రభుత్వ తప్పిదమేమీ లేనందున ప్రభుత్వం వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదని మోడీ తన కేబినెట్ సహచరులకు సలహా ఇచ్చారంటున్నారు.
మత మార్పిడులంటూ చెలరేగుతున్న నేపథ్యంలో పార్లమెంట్లో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడాల్సిన అవసరమేమీ లేదనీ ఆయన బుధవారం తనను కలిసిన కొంతమంది మంత్రులకు సూచించారని చెబుతున్నారు. మనమేమీ తప్పు చేయనప్పుడు మనమెందుకు కలవరబడాలని ఆయన మంత్రులతో అన్నట్లుగా చెబుతున్నారు.
ఉభయసభలలో ప్రభుత్వం దూకుడు వైఖరి కొనసాగించడమే మేలని ప్రధాని వారికి సూచించారంటున్నారు. పెచ్చరిల్లుతున్న మతఘర్షణలపై చర్చకు మోడీ రాజ్యసభకు వచ్చి సమాధానమివ్వాలనీ, అంతవరకు సభా కార్యకలాపాలు సాగనివ్వబోమంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై చర్చించేందుకు ప్రధాని కొంతమంది మంత్రులతో బుధవారం సమావేశమై రాజకీయ వ్యూహం గురించి చర్చించారు. మతమార్పిడులపై ప్రభుత్వ వైఖరి గురించి మంత్రులు నేరుగా ప్రజలకు వివరించి చెప్పాలని మోడీ సూచించారని తెలుస్తోంది.
ప్రస్తుత ప్రతిష్టంభనను తొలగించేందుకు మోడీ పార్లమెంట్లో ప్రకటన చేసే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్యనాయుడు విలేకరులకు చెప్పారు. మోడీకి ప్రకటన చేసే ఆలోచన ఏదీ లేదని, ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన రాజ్యసభకు వస్తారన్నారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరిస్తాయన్న నమ్మకం తనకుందన్నారు.