శశికళకు రివర్స్: ప్రాణహానీ లేదని చెప్పిన కర్నాటక ఐబీ, అదే జరిగితే..
బెంగళూరు: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు జైలులో ఎలాంటి ప్రాణహానీ లేదని కర్నాటక రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తెలిపింది. ప్రమాదం తదితర కారణాలతో శశికళను పరప్పన అగ్రహార జైలు నుంచి తమిళనాడులోని చెన్నై లేదా వేలూరు జైలుకు తరలించాలనే ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే.
అంతేకాదు, తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు.. ప్రాణహాని అనుమానాలు వ్యక్తం చేస్తూ.. తమిళనాడు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడం ద్వారా అన్నాడీఎంకే డిమాండుకు చెక్ చెబుతున్నారు. ఇది శశికళకు షాక్ అని చెప్పవచ్చు.
ప్రాణహానీ లేదు
ఈ నేపథ్యంలో శశికళకు ఎలాంటి ప్రాణహానీ లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో తెలిపింది. ఐబీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెకు జైలులో ఎలాంటి ప్రమాదం లేదు. జైలులో ఆమెకు తగిన భద్రత ఉంది. అలాగే, జైలు సహచరుల నుంచి కూడా ఎలాంటి ప్రమాదం లేదు.
జైలు మార్పిడి కోసం ప్రయత్నాలు
శశికళను పరప్పన అగ్రహార జైలు నుంచి చెన్నై తరలించేందుకు అన్నాడీఎంకేతో పాటు శశికళ కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం న్యాయ నిపుణులను కూడా సంప్రదిస్తున్నారని అంటున్నారు.
అదే జరిగితే.. కర్నాటక నో చెబుతుంది
ఒకవేళ శశికళ జైలు మార్చాలని దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ.. కర్నాటక దానిని తిరస్కరించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఒకవేళ.. కోర్టుకు వెళ్తే తనకు ప్రాణహానీ ఉందని శశికళ చెప్పినా.. కర్నాటక మాత్రం వాటిన అవాస్తవాలని కొట్టి పారేసే పరిస్థితి కనిపిస్తోంది.
శశికళ నుంచీ ఫిర్యాదు లేదు
జైలు అధికారులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. శశికళకు ఎలాంటి ప్రాణహానీ లేదని చెప్పారు. ఆమెకు తగిన భద్రత కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు, శశికళ నుంచి కూడా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు.