ఐటీ శాఖ సంచలనం: బదిలీలతో కమిషనర్లకు షాక్, భారీగా సంస్కరణలు
ఆదాయపన్ను శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐటీ విభాగంలో ఉన్నతాధికారుల బదిలీలతో భారీగా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ‘పనితీరు’ మెరుగ్గా లేని కమిషనర్లకు బదిలీ షాక్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐటీ విభాగంలో ఉన్నతాధికారుల బదిలీలతో భారీగా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 'పనితీరు' మెరుగ్గా లేని కమిషనర్లకు బదిలీ షాక్ ఇచ్చింది.
దేశ వ్యాప్తంగా ముఖ్యమైన స్థానాల్లో ఉన్న అధికారులను ఆదాయపన్ను శాఖ బదిలీ చేసింది. దీంతో ఆదాయ పన్ను కమిషనర్లకు సంబంధించి ఇదే అతి పెద్ద మార్పుగా భావిస్తున్నారు.
డైరెక్ట్ ట్యాక్స్ సెంట్రల్ బోర్డ్(సీబీడీటీ)లో దేశవ్యాప్తంగా 245 మంది కమిషనర్లను కీలక స్థానాల నుంచి బదిలీ చేసినట్లు తాజా సమాచారం. సీబీడీటీలో నాన్ - పెర్ఫార్మెన్స్ అధికారులతోపాటు విజిలెన్స్ లేదా ఇతర క్రమశిక్షణా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని, అలాగే పదవిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల సర్వీసు ఉన్న అధికారులకు స్థాన చలనం కల్పించింది.
గత ఆర్థిక సంవత్సరం పన్ను మినహాయింపులో 91 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులను ఆదాయపన్ను శాఖ గుర్తించింది. ముఖ్యంగా చిన్న నగరాలలో పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వారిని గుర్తించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే తదితర మరికొన్ని మెట్రో నగరాలతో పోల్చినప్పుడు టైర్-2, టైర్-3 నగరాలు జనాభా సాంద్రత, మానవ వనరులు కొద్దిగా తక్కువే.
సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్ర దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ ఐటి కార్యాలయాలకు రాసిన ఒక లేఖలో.. ఈ సంవత్సరం తమ పన్ను పరిధిని గణనీయంగా విస్తరించడానికి, వారి అధికార పరిధిలోని ప్రాంతానికి సంబంధించి ప్రత్యేక ప్రొఫైల్ కు అనుగుణంగా 'ప్రాంతీయ వ్యూహాన్ని' అభివృద్ధి చేయాలని కోరారు.
జూలై 12న ఉన్నతాధికారులకు జారీ చేసిన ప్రత్యేక నిర్దేశకత్వాల్లో.. వాణిజ్య సంస్థలు, మార్కెట్ సంస్థలు, ఇతరుల ద్వారా సమాచారాన్ని సేకరించి పన్ను ఎగవేతదారులను గుర్తించాలని ఆదేశించారు.
ప్రత్యేకించి టైర్-2, టైర్-3 నగరాల్లో పన్ను చెల్లింపులను ప్రోత్సహించే విధంగా అవగాహన సమావేశాలు, అవుట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహించనున్నామని కూడా సీబీడీటీ ఛైర్మన్ తన లేఖలో పేర్కొన్నారు.
అలాగే ప్రజా సెషన్లు నిర్వహించాలని పన్ను అధికారులకు ఆయన సూచించారు. జీఎస్టీ అమలుపై నెలవారీ నివేదికలను సిద్ధం చేయాల్సిందిగా సీనియర్ అధికారులు, జోనల్ హెడ్ లను కోరారు.