ఉపాధి కల్పన: అమిత్ షా కప్పదాట్లు, అయినా బీరాలు
ఏరు దాటే వరకు ఓడ మల్లయ్య.. దాటాక బోడి మల్లయ్య సామెత ఖచ్చితంగా కమలనాథులకు సరిపోతుంది.
న్యూఢిల్లీ: ఏరు దాటే వరకు ఓడ మల్లయ్య.. దాటాక బోడి మల్లయ్య సామెత ఖచ్చితంగా కమలనాథులకు సరిపోతుంది. 2013లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఖరారుచేసినప్పటి నుంచి ఉద్వేగ పూరిత ప్రసంగాలతో యావత్ భారతావనిని ఉర్రూతలూగించిన నేపథ్యం ఆయనది.
తనకు అదికారం అప్పగిస్తే అచ్ఛేదిన్ తీసుకొస్తానని హామీలు గుప్పించారు. వాగ్దానాలు చేయకపోతే పాపం అన్నట్లు వ్యవహరించారు. ఏటా కోటి మందికి ఉద్యోగాలు కల్పిస్తామని.. విదేశీ బ్యాంకుల్లో కుబేరులు దాచి పెట్టుకున్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఓటరు ఖాతాలో రూ.15 లక్షల నగదు జమ చేస్తానని భారీ హామీలు గుప్పించారు.
దీనికి తోడు జాతి ప్రగతి పేరిట బీజేపీ మద్దతుగా.. అవినీతిమయం అని కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని నాటి యూపీఏ ప్రభుత్వంపై ప్రణాళికా ప్రకారం సోషల్ మీడియాలో ప్రచార హోరు సాగించారు. మోదీ ఒక చాయ్ వాలా అన్న నినాదాన్ని ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. ఏటా కోటి మందికి ఉద్యోగాలు కల్పించడం అసాధ్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రకటనతో అచ్చేదిన్ పేరిట కమలనాథులు చేసిన ప్రచారంలో డొల్లతనం బయటపడింది.
యువతను ఆశల పల్లకిలో ముంచెత్తిన బీజేపీ
దేశ ప్రగతి, సంప్రదాయాలు, సంస్క్రుతి తదితర అంశాలపై భారతదేశంలో పలు తరాలు మారిపోయాయి. దేశానికి స్వాతంత్ర్యోద్యమం.. నాటి ఆందోళనల్లో జాతీయోద్యమ నేతల పాత్ర వాస్తవాలు పాత తరానికి మాత్రమే తెలుసు. కానీ ఈనాడు యువతరం భవిష్యత్ భారతావనికి సారథ్యం వహించాల్సి ఉన్నది. ఆ యువతరానికి ఆశల తాయిలం చూపి.. నినాదాల హోరులో విజయం సాధించిన బీజేపీ ఈ నాడు అందరికీ ఉద్యోగాలు కల్పించలేమని పేర్కొంటున్నది. కేంద్రంలో బీజేపీలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. సార్వత్రిక ఎన్నికలకు మధ్య మరో ఏడాది మాత్రమే గడువు ఉన్నది. మోదీ కేంద్రంగా సాగుతున్న జాతీయ రాజకీయాల్లో అధికార విపక్షాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీలు, కూటములు వ్యూహ ప్రతి వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి.
స్వయం ఉపాధి కల్పిస్తున్నామని కమల‘నాథుడి' ప్రకటన
ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ 125 కోట్ల మంది జనాభా గల భారత దేశంలో సంఘటిత రంగంలో అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కుదరదని తేల్చి చెప్పారు. ఈ కారణంతోనే స్వరోజ్ గార్ (స్వయం ఉపాధి)ని ప్రోత్సహిస్తున్నట్టు ఆయన తెలిపారు. బోర్డర్ ఎకనామిక్ రివైల్ కింద బీజేపీ ఉద్యోగాల సృష్టికి, ఎంటర్ ప్రీన్యూర్ షిప్ అవకాశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని అమిత్ షా తెలిపారు. స్వయం ఉపాధికి యువతను ఎక్కువగా ప్రోత్సహించనున్నట్టు కూడా వాగ్ధానం చేశారు. కానీ స్వయం ఉపాధి కోసం ఎంత మందికి స్వయం ఉపాధి కల్పించారన్న సంగతి అమిత్ షా.. సంఘటిత రంగంలో కేంద్ర కార్మికశాఖ కల్పించిన ఉద్యోగాలు, బ్యాంకులు, యువజన సర్వీసుల శాఖ నుంచి కల్పించిన స్వయం ఉపాధి పథకాల గురించి తెలుసుకుంటే సబబని భావిస్తున్నారు. గమ్మత్తేమిటంటే మీడియాతో అమిత్ షా మాట్లాడిన మాటలు ప్రజలకు తెలియరాదన్న బాధతో కొన్ని మీడియా సంస్థలు ఉద్యోగాలు కల్పించలేమన్న అంశం ప్రచురించకుండా వెనుకడుగు వేసింది.
నిరుద్యోగితపై అమిత్ షా ఇలా
నిరుద్యోగంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఖండించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ శాతం 2013-14లో 4.9 శాతం ఉంటే, 2015-16లో స్వల్పంగా 5శాతానికి పెరిగిందని అధికారిక గణాంకాలు వచ్చాయి. ఈ అధికారిక గణాంకాలను ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయి. లేబర్ బ్యూరో తాజా గణాంకాల ప్రకారం 2016 అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో 1.52 లక్షల మంది క్యాజువల్ లేబర్ ఉద్యోగాలు కోల్పోయినట్టు తెలిసింది.
2015 -16లో స్వల్పంగా ఉద్యోగాల కల్పన
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడేళ్ల కాలంలో నిరుద్యోగుల సంఖ్య తగ్గాల్సింది పోయి కొంచెం పెరిగిందని ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి రాకముందు, 2013-2014 ఆర్థిక సంవత్సరంలో దేశంలో నిరుద్యోగుల సంఖ్య కార్మిక శక్తితో 4.9 శాతం ఉండగా, 2015-16 ఆర్థిక సంవత్సరానికి 5 శాతానికి చేరుకున్నది. నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామని, రోడ్లు, విద్యుత్ను అందరికి అందుబాటులోకి తీసుకొస్తామని, దేశాన్ని స్వచ్ఛ భారత్గా తీర్చి దిద్దుతామని, ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో ప్రధానంగా హామీ ఇచ్చింది.
నోట్ల రద్దు నిర్ణయం అవినీతి అంతానికేనని అమిత్ షా
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సాధించిన ప్రగతిపై ‘ఇండియా స్పెండ్' సంస్థ విశ్లేషించింది. పదేళ్ల యూపీఏ పాలనలో అదుపుతప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామని, కొత్త ఉద్యోగాల సృష్టికి, వ్యాపారాల అభివద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ ప్రభుత్వం తెలిపింది. బీజేపీ అధికారంలోకి వస్తే కోటీ ఉద్యోగాలను కొత్తగా తీసుకొస్తామని ఆగ్రాలో జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా హామీ ఇచ్చారు. తాజాగా అసోంలో దేశంలోకెల్లా అతిపొడవైన రహదారి ప్రారంభించిన తర్వాత అవినీతిని అంతం చూస్తానని మరోసారి ప్రధాని మోదీ హామీలు గుప్పించారు. గతేడాది నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ మొదలు బీజేపీ నేతలంతా ఊదరగొట్టారు. కానీ నోట్ల రద్దు నిర్ణయం తర్వాత తెర వెనుక అక్రమార్కులు తమ వద్ద భారీగా ఉన్న పాతనోట్లు హాయిగా మార్చేసుకున్నారు. ఉగ్రవాద నిర్మూలించేందుకే నోట్ల రద్దని ప్రధాని మోదీ చెప్పినా.. ఆచరణలో కశ్మీర్ కల్లోలంగా మారుతున్నది. దేశ వ్యాప్తంగా అప్పుడప్పుడు ఉగ్రవాద దాడులు జరుగుతున్న వార్తలు వస్తూనే ఉన్నాయి.
బీజేపీ సగం ఉద్యోగాలే కల్పన
2014 జూలై నుంచి 2016 డిసెంబర్ మధ్య కాలంలో ఉత్పత్తులు, వాణిజ్యం, భవన నిర్మాణం, విద్యా, ఆరోగ్య, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, రవాణా, వసతి, రెస్టారెంట్ రంగాల్లో 6,41,000 కొత్తగా ఉద్యోగాలు పెరిగాయని, మొత్తంగా నిరుద్యోగ సమస్య ఐదు శాతానికి చేరుకుందని 2015-16లో వార్షిక నిరుద్యోగంపై జరిపిన ఐదవ ఆర్థిక సర్వే తెలిపింది. ఆ తర్వాత 2016-17 గణాంకాలు తెలియకున్నా, ఉద్యోగ పురోగతి సవ్యంగా లేదని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. బీజేపీ అధికారంలోకి రాకముందు, అంటే యూపీఏ అధికారంలోవున్న 2011 జూలై నుంచి 2013 డిసెంబర్ నాటికి, రెండేళ్ల కాలంలో 12 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి రెండేళ్లలో అందులో కొత్తగా సగం ఉద్యోగాలే కల్పించగలిగింది.