బాహుబలి కోసం.. ములాయం వారిని మూడు గంటలు నిలబెట్టాడు..
ప్రస్తుతం ఇండియాలో కేవలం 16మందికి మాత్రమే వీవీఐపీ భద్రత కల్పిస్తున్నారు. అందులో ములాయం సింగ్ ఒకరు. అయితే ఎన్ఎస్జి కమెండోల సేవలను వ్యక్తిగత భద్రతకు ఉపయోగించడం పట్ల విమర్శలు కూడా ఉన్నాయి.
లక్నో: ఎన్ఎస్జీ కమెండోల విషయంలో సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం నాడు బాహుబలి సినిమా చూసిన ములాయం.. సినిమా చూస్తున్నంత సేపు మూడు గంటల పాటు కమెండోలను నిలబెట్టే ఉంచారు. ప్రోటోకాల్ పేరు చెప్పి.. వారిని మూడు గంటలు నిలబెట్టడం పట్ల నెటిజెన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసన్ జైన్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫోటోను షేర్ చేయడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఫోటో వైరల్ కావడంతో.. ములాయం తీరును నెటిజెన్స్ తప్పుపడుతున్నారు. వీవీఐపీ కల్చర్ పేరుతో అమానవీయంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Note the NSG standing at the back -- prob for the full 3 hrs. https://t.co/BcO7SXnSCR
— Sreenivasan Jain (@SreenivasanJain) May 17, 2017
కాగా, లక్నోలోని గోమ్తినగర్ లో మంగళవారం నాడు ములాయం సింగ్ బాహుబలి-2 సినిమాను వీక్షించారు. సోదరుడు శివపాల్ యాదవ్, అధికారులతో కలిసి ఏసీ గదిలో దర్జాగా ఆయన సినిమా చూస్తుంటే.. సెక్యూరిటీలో ఉన్న ఎన్ఎస్జి కమెండోలు మూడు గంటల పాటు నిల్చుండిపోయారు. పైన ఫోటోలో కమెండోలు.. ములాయం వెనుక నిలబడి ఉండటాన్ని గమనించవచ్చు.
ప్రస్తుతం ఇండియాలో కేవలం 16మందికి మాత్రమే వీవీఐపీ భద్రత కల్పిస్తున్నారు. అందులో ములాయం సింగ్ ఒకరు. అయితే ఎన్ఎస్జి కమెండోల సేవలను వ్యక్తిగత భద్రతకు ఉపయోగించడం పట్ల విమర్శలు కూడా ఉన్నాయి. వారి పని ఉగ్రవాదులను మట్టుబెట్టడమేనని, అలాంటి వారిని సెక్యూరిటీ కోసం నియమించవద్దని గతంలో ఎన్ఎస్జీ హోంమంత్రికి లేఖ రాసింది.