‘జాతి వ్యతిరేక నినాదాలు, జెండాను కాల్చడం తప్పుకాదు’
పాట్నా: విదాస్పద బీహార్ నేత, మధేపురా ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్.. ఏ భారతీయుడూ సమర్థించని వ్యాఖ్యలు చేశాడు. జాతి వ్యతిరేక నినాదాలు చేయడం, జమ్మూ కాశ్మీర్లో జాతీయ పతాకాన్ని తగుల బెట్టడం తప్పుకాదని వ్యాఖ్యానించి రాజేశ్ రంజన్ మరో వివాదానికి తెరలేపాడు.
బీహార్లో సోమవారం మీడియాతో మాట్లాడిన పప్పూ యాదవ్.. హిందూ సన్యాసులు, సాధువులపైనా ధ్వజమెత్తారు. హిందూ సన్యాసులందరూ జాతి వ్యతిరేకులే అంటూ వివాదాన్ని రగిలించాడు.
హిందూ సాధువులందరూ జాతి వ్యతిరేకులనీ, అందుకే పేదలు దేవాలయాలకు వెళ్లడం మానుకోవాలని పిలుపునిచ్చారని అన్నారు. వారి దోపిడీ దౌర్జన్యాల నుంచి కాపాడుకునేందుకు పేదలు గుళ్లకు వెళ్లకుండా వుండాలన్నారు.
కాగా, ఐదుసార్లు ఎంపీగా గెలిచిన పప్పూ యాదవ్పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అటు సౌపాల్ నియోజకవర్గం నుంచి ఆయన భార్య రంజీత్ రంజన్ కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు.
లాలూతో విభేదించిన రాజేశ్ రంజన్ ఆర్జేడీ నుంచి బయటకొచ్చి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జన అధికార పార్టీని స్థాపించి అదే పార్టీ నుంచి మధేపురా ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా, పప్పుయాదవ్ వ్యాఖ్యలను రాష్ట్ర బిజెపి నేతలు తీవ్రంగా ఖండించారు.
కాగా, ఇటీవల పప్పు యాదవ్ మాట్లాడుతూ.. అవినీతి రాజకీయ నాయకులు, అధికారులను ఎవరైనా కొట్టి చంపితే వారికి రూ. 10 లక్షలు నజరానా ఇస్తానని ప్రకటించి సంచలనం సృష్టించాడు.