ఇక, 'ఐఏఎస్' అవినీతిపై కామన్ మ్యాన్ పోరాటం
న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారుల అవినీతి పైన ఇప్పుడు కామన్ మ్యాన్ నిరభ్యంతరంగా పోరాడవచ్చు. ఇందుకు సంబంధించి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. అవినీతి ఐఏఎస్ అధికారులపై విచారణ జరపమని ప్రతిపాదించే అధికారం సామాన్య ప్రజలకు కూడా కల్పించింది.
అంతేకాదు, ఇందుకు సదరు కామన్ మ్యాన్ రుజువు పత్రాలను పెట్టవలసిన అవసరం లేదు. అయితే, సదరు అధికారి అవినీతిని తేల్చే బాధ్యత మాత్రం రాష్ట్రాలదే. అధికారి ఎలాంటి ఆధారాలు లభించకుంటే ఫిర్యాదుదారుడికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
2012లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పైన సుబ్రహ్మణ్య స్వామి వేసిన ఓ కేసులో సుప్రం తీర్పునిస్తూ పబ్లిక్ సర్వెంట్లు తప్పు చేశారని భావిస్తే సామాన్యులు కూడా విచారణ జరపాలని సమర్థ అధికార కేంద్రం వద్ద ప్రతిపాదించవచ్చునని, దానిని నిరోధించే చట్టాలు లేవని చెప్పింది. ఈ తీర్పు ఆధారంగా కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఐఏఎస్ల పైన సాధారణ ప్రజలు విచారణ కోరితే, ఆధారాలు సరిపోతాయని భావిస్తే విచారణకు అనుమతించవచ్చునని, సంతృప్తి చెందకుంటే తిరస్కరించవచ్చునని నాడు సుప్రీం కోర్టు తెలిపింది. తన వద్ద అధారాలు స్పష్టంగా ఉంటే పౌరుడు మరలా కోర్టుకు వెళ్లొచ్చు.