అర్ధరాత్రి సీఎంగా పన్నీరు సెల్వం ప్రమాణం: చాయ్వాలా నుంచి.. ఇదీ ప్రస్థానం
పన్నీరు సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జయలలిత మృతి నేపథ్యంలో ఆయన అర్ధరాత్రి ఒకటి గంటల సమయంలో సీఎంగా ప్రమాణం చేశారు.
చెన్నై: పన్నీరు సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జయలలిత మృతి నేపథ్యంలో ఆయన అర్ధరాత్రి ఒకటి గంటల సమయంలో సీఎంగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటు 15 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
జయలలిత అస్తమయం: తమిళనాడు రాజకీయాల్లో ఒక శకం ముగిసింది
ఈ సందర్భంగా గవర్నర్ విద్యాసాగర రావు మాట్లాడారు. ప్రజా హృదయనేత జయ మరణం తీరని లోటు అన్నారు. కార్యక్రమానికి ముందు శాసనసభా పక్షం రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. జయలలిత గుండెపోటుతో కన్నుమూయడంతో ఆమె స్థానంలో ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వంను ఎన్నుకున్నారు.
జయకు విధేయుడు
జయలలితకు అత్యంత విధేయుడి పన్నీరు సెల్వం. క్లిష్టసమయాల్లో కూడా ఆమె ఆయన్ను విశ్వాసంలోకి తీసుకునేవారు. గతంలో కూడా జయలలిత ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకొన్నప్పుడు ఆయనే ఈ బాధ్యతలను నిర్వహించారు. సోమవారం రాత్రి జరిగిన అన్నాడీఎంకే సమావేశంలో ఆయన్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
32 ఏళ్ల చరిత్రను తిరగరాసిన 'అమ్మ', కానీ కలిసి రాలేదు!
ఇదీ పన్నీరు సెల్వం ప్రస్థానం
పన్నీర్ సెల్వం 1951 జనవరి 14న పెరియాకులంలో జన్మించారు. గతంలో జయలలిత రెండుసార్లు చిక్కుల్లో పడినప్పుడు.. ఆమె కోరిక మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మొదట ఓ టీ స్టాల్ ఓనర్గా జీవితాన్ని ఆరంభించిన పన్నీర్ సెల్వం 1996లో మున్సిపల్ ఛైర్మన్గా ఎన్నికయ్యారు.
2001లో ఆరు నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకి వెళ్లడంతో ముఖ్యమంత్రి పదవిని మరోసారి చేపట్టారు. ఇటీవల సెప్టెంబర్ 22న జయలలిత అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో ఆమె వద్ద శాఖను పన్నీరు సెల్వకు బదలాయించారు. ఇప్పుడు సీఎంగా ప్రమాణం చేశారు.