ముఖ్యమంత్రులకు ఆహ్వానం: ఒబామాను చంద్రబాబు కలుస్తారా?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ఈ మేరకు రాష్ట్రపతి భవన్లో ఒబామా దంపతులకు రాష్ట్రపతి ప్రణబ్ ఇచ్చే విందులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపారని తెలుస్తోంది.
ఆదివారం ఢిల్లీకి చేరుకున్న ఒబామా మొదటగా రాజ్ఘాట్ను సందర్శించారు. అనంతరం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందులో పాల్గొననున్నారు. ఇందులో పాల్గొనాల్సిందిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాజ్భవన్ వర్గాలు ఆహ్వానం పంపాయి.
మరోవైపు, భారత్ పర్యటనకు వచ్చిన బరాక్ ఒబామాతో భేటీ అయ్యేందుకు చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారు. అయితే అది ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందడంతో విందు కార్యక్రమం సమయంలోనే ఒబామాతో బాబు భేటీకి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు హైదరాబాదు వచ్చి, అటు నుండి ఢిల్లీకి చేరుకోవచ్చంటున్నారు.
కాగా, బరాక్ ఒబామా భారత్ వచ్చినప్పుడు ఆయనతో అపాయింటుమెంట్ కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నించిన విషయం తెలిసిందే. హైదరాబాదుకు తీసుకు వచ్చేందుకు లేదా ఢిల్లలో ఆయనతో భేటీ అయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరారు.