తిరుపతిలో ఒడిషా మాజీ సిఎం పట్నాయక్ కన్నుమూత
తిరుపతి: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, అసోమ్ మాజీ గవర్నర్ జానకీ బల్లభ పట్నాయక్ (88) మంగళవారం తెల్లవారుజామున కన్ను మూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందతూ ఆయన తుది శ్వాస విడిచారు.
జెబి పట్నాయక్ గత కొంత కాలంగా గుండెపోటుతో బాధపడుతున్నారు. తిరుపతిలో జరిగే రాష్ట్రీ విద్యాపీఠ్ కార్యక్రమానికి వచ్చిన ఆయన ఛాతీ నొప్పి రావడంతో స్విమ్స్లో చేరారు. చికిత్స పొందుతూ ఆయన మంగళవారం తెల్లవారు జామున మరణించారు.
జెబి పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు దాదాపు 14 ఏళ్లు పనిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. తర్వాత అసోం గవర్నర్గా నియమితులయ్యారు.
ఆయన అంత్యక్రియలు పూరీలో జరుగుతాయి. ఆయన 1927 జనవరి 3వ తేదీన జన్మించారు. కాంగ్రెసు నేత అయిన ఆయన 1980లో ఒడిశా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1995 నుంచి నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2009లో అసోం గవర్నర్గా నియమితులయ్యారు.
జెబి పట్నాయక్ 1947లో ఉత్కల్ విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. బెనరాస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి 1949లో రాజకీయ శాస్త్రంలో ఎంఎ డిగ్రీ పొందారు.