అమ్మేసుకుంటున్నారు: బీఎస్ఎఫ్ ఆఫీసర్లపై షాకింగ్ ఆరోపణలు
సైనికులకు ఇస్తున్న ఆహారం పైన రగడ కొనసాగుతుండగానే జమ్ము కాశ్మీర్లోని కొందరు సైనికాధికారుల తాజాగా, షాకింగ్ ఆరోపణలు వస్తున్నాయి.
శ్రీనగర్: సైనికులకు ఇస్తున్న ఆహారం పైన రగడ కొనసాగుతుండగానే జమ్ము కాశ్మీర్లోని కొందరు సైనికాధికారుల తాజాగా, షాకింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
భారత దేశ సరిహద్దుల్లో మొదటి రక్షణ వలయమైన బీఎస్ఎఫ్లో కొందరు అధికారులు పక్కదారి పడుతున్నారట. ఎండనకా వాన అనకా కాపలా కాస్తున్న జవాన్లకు అందవలసిన బలవర్ధక ఆహారపదార్థాలను బ్లాక్ మార్కెట్లో సగం ధరకు అమ్ముకుంటున్నారట.
ఆహార నాణ్యత విషయంలో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఓ జవాన్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో కలకలం రేపిన విషయం తెలిసిందే. తమకు వచ్చే సరకులు, పెట్రోల్, డీజిల్ వంటివి స్థానికులకు సగం ధరకే బీఎస్ఎఫ్ అధికారులు కొందరు అమ్ముతున్నారని సరికొత్త ఆరోపణలు వస్తున్నాయి.
శ్రీనగర్ విమానాశ్రయం దగ్గర్లోని బీఎస్ఎఫ్ ప్రధాన కేంద్రంలో కొందరు అధికారులు ఇక్కడి వ్యాపారులకు వీటిని విక్రయిస్తున్నారని స్థానికులు, బీఎస్ఎఫ్కు చెందిన జవాన్లు ఆరోపిస్తున్నారు.
క్షిపణి ప్రయోగం.. అంతా వట్టిదేనా, వీడియోలో..: పాక్ నవ్వులపాలయింది!
తమకు కూడా ఇవ్వకుండా కందిపప్పు, కూరలు వంటివి బయట ఉండే వర్తకులకు విక్రయిస్తున్నారంటూ పేరు చెప్పడానికి ఇష్టంలేని ఓ బీఎస్ఎఫ్ జవాను ఆరోపించినట్లుగా చెబుతున్నారు.
పెట్రోల్, డీజిల్ వంటివి బీఎస్ఎఫ్ అధికారులు తక్కువ ధరకే విక్రయిస్తుంటారని, బియ్యం, పప్పులు వంటివైతే చాలా చౌకగా దొరుకుతుంటాయని ఓ సివిల్ కాంట్రాక్టర్ వ్యాఖ్యానించారు.
ఒక్క ఆహార పదార్థాల విషయంలోనే కాదు ఫర్నిచర్ కొనుగోళ్ల విషయంలో కూడా అధికారులు కమిషన్లు తీసుకుంటారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఎస్ఎఫ్లో ఈ-టెండర్ విధానం లేకపోవడం వల్ల తమ వద్ద ఫర్నిచర్ కొనుగోలు చేసి కమిషన్లు కూడా తీసుకుంటారనే ఆరోపణలు వస్తున్నాయి.