మోడీపై గౌరవం తగ్గింది, రాహుల్కు ప్రశంసలు: ఒమర్ అబ్దుల్లా
న్యూఢిల్లీ: విదేశీ పర్యటనల్లో గత ప్రభుత్వాలను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్రమోడీ చేసిన తప్పిదమని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై గౌరవభావం తగ్గిందని, కేవలం నేను, నేనొక్కడినే అనే తీరుగా వ్యవహరించడమేనని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. అటు మోడీని విమర్శించడంతో పాటు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు.
ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లే ముందు ఉన్న రాహుల్కు, ప్రస్తుతం కనిపిస్తున్న రాహుల్కు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. మోడీ పరిపాలనపై రాహుల్ గాంధీ పదునైన విమర్శలు చేస్తూ ఆకట్టుకుంటున్నారని మెచ్చుకున్నారు.
ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తీరును చూసి ఆశ్చర్యానికి లోనయినట్లు చెప్పారు. ఇక స్వదేశంలో ప్రతిపక్షాలపై విమర్శలు చేసే మోడీ, విదేశాల్లో కూడా అలాంటి విమర్శలే చేసి, దేశంలో తాను మాత్రమే గొప్ప అనే భావనకి బీజం వేస్తున్నారని, అలాంటి వ్యాఖ్కల కారణంగా ఆయనపై గౌరవం తగ్గిందని ఒమర్ స్పష్టం చేశారు.
విదేశీ పర్యటనలో ప్రతిపక్షాలను విమర్శించడం మోడీ తప్పిదమని గతంలో విదేశాంగ శాఖ సహాయమంత్రిగా చేసిన ఒమర్ అబ్దుల్లా అభివర్ణించారు. భారత్లో పుట్టినందుకు సిగ్గుపడుతున్నామని విదేశాల్లోని భారతీయులు అంటున్నారంటూ ఓమర్ పేర్కొన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికా వెళ్లేందుకు వీసా కూడా లభించలేదని, పోయిన సంవత్సరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ఆయన చేస్తున్న పర్యటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని అన్నారు. ఇంకో అడుగు ముందుకేసి మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్లో మోడీ ఏడాది పాలన గురించి 'వన్ మ్యాన్ షో' అంటూ ట్వీట్ చేశారు.