75 శాతం పెరిగాయి: దేశంలోనే అత్యధికం ఈ ఎమ్మెల్యేల జీతాలు
బెంగుళూరు: కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులకు జీతాలు పెరిగాయి. 2015-16 సంవత్సరానికి గాను ఈ మేరకు ఆ రాష్ట్ర ఉభయ సభలు ఎలాంటి చర్చ లేకుండానే జీతభత్యాల పెంపుదల బిల్లును ఆమోదించాయి. దీంతో ఎమ్మెల్యేల జీతాలు 75 శాతం పెరిగాయి. దేశంలోని మిగతా రాష్ట్రాల ఎమ్మెల్యేలతో పోల్చితే అత్యధిక జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యేలుగా కర్ణాటక శాసన సభ్యులు ఉండబోతున్నారు.
పెరిగిన జీతాలతో ఆ రాష్ట్ర ఖజానాకు 44 కోట్ల భారం పడనుంది. సీఎంకు రూ. 30 వేల నుండి రూ. 50 వేలకు, క్యాబినెట్ మంత్రులకు రూ. 25 వేల నుండి రూ. 40 వేలకు నెలకు పెంచారు. ఇక వీరికి వ్యక్తిగత ఖర్చుల కింద నెలకు రూ 1.5కు బదులు ఇకపై రూ. 3 లక్షలు కేటాయిస్తారు. ఇక సహాయ మంత్రులకు నెలకు జీతం రూ. 16 వేల నుండి రూ. 30 వేలకు పెంచారు.
వీరి వ్యక్తిగత ఖర్చు మొత్తాన్ని రూ.80 వేల నుండి రూ. 2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే, ఎమెల్సీలకు నెలకు జీతం రూ. 25 వేలకు పెంచారు. గతంలో వీరికి రూ. 20లు నెలకు ఇచ్చేవారు. వీటితో పాటు అద్దె, ప్రయాణం, హోటల్ విడిదిలకు సైతం అలవెన్స్ పెంచారు. శాసన సభ్యుల పదవీ విరమణ అనంతరం భవిష్యత్ ఫించన్ను రూ. 15 వేల నుండి రూ. 40 వేలకు పెంచారు.