10గం.పాటు ఆపరేషన్: ముగ్గురు లష్కరే టెర్రరిస్ట్ల హతం
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్లో జరిగిన ఉగ్రదాడి ముష్కరులను భారత సైన్యం మట్టుబెట్టింది. తీవ్రవాదులను మట్టుపెట్టడంతో గురుదాస్ పూర్ ఆపరేషన్ ముగిసినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదులు, భారత సైన్యం మధ్య 10 గంటలకు పైగా పోరు సాగింది.
గురుదాస్ పూర్ ఆపరేషన్ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించవలసి ఉంది. మొత్తం పదిమంది వరకు తీవ్రవాదులు ఉన్నట్లుగా వార్తలు వచ్చినప్పటికీ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు తీవ్రవాదులను మన జవాన్లు మట్టుబెట్టారు.
ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి పోలీసు స్టేషన్ పైన దాడి చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల దాడిలో ఎందరు మృతి చెందారనే విషయమై స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు మృతి చెందినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.
మృతి చెందిన వారిలో ముగ్గురు పోలీసులు, ముగ్గురు పౌరులు ఉన్నారు. ఉగ్రదాడిలో గురుదాస్ పూర్ డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్ మృతి చెందారు. ఉగ్రవాదులు హతమయ్యే వరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరిస్థితిని సమీక్షించారు. ప్రధాని మోడీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
పంజాబ్ రాష్ట్రం గురుదాస్పూర్ జిల్లాలో ఉగ్రదాడి నేపథ్యంలో అధికారులు రాజస్థాన్ రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం చేశారు. సోమవారం ఉదయం దినానగర్లోని పోలీస్ స్టేషన్, బస్సుపై దాడులకు పాల్పడగా, పలువురు మృతి చెందారు.
ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాష్ట్రంలోనూ భద్రత పెంచినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులు, ఐజీ స్థాయి అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి గులాబ్చంద్ శాంతిభద్రతలపై పోలీసు అధికారులతోనూ భేటీ అయ్యారు.
దాడికి పాల్పడింది లష్కరే తోయిబా తీవ్రవాదులు
గురుదాస్ పూర్ ఆఫరేషన్ ఐదు గంటలకు అధికారికంగా పూర్తయినట్లుగా తెలుస్తోంది. దాడికి పాల్పడింది లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా చెబుతున్నారు. లష్కర్ ప్రాంతంలోని హీరా నగర్ నుండి ముగ్గురు తీవ్రవాదులు భారత్లోకి చొరబడ్డారు.