తాజా సర్వే: బీజేపీ ఖాతాలో ఉత్తరాఖండ్, యూపీ, పంజాబ్, గోవాలో హంగ్
వీక్-హన్సా రీసెర్చ్ జరిపిన సర్వేలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవాల్లో హంగ్ అసెంబ్లీలు ఏర్పడే అవకాశం ఉందని తేలింది.
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన హవాను కొనసాగించే అవకాశాలున్నట్లు ఓపీనియన్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా, వీక్-హన్సా రీసెర్చ్ జరిపిన సర్వేలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవాల్లో హంగ్ అసెంబ్లీలు ఏర్పడే అవకాశం ఉందని తేలింది. ఉత్తర ప్రదేశ్, గోవాల్లో బిజెపి అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, అలాగే ఉత్తరాఖండ్లో ఆ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
పంజాబ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీయే మెజార్టీ సీట్లను గెలుచుకోవచ్చునని ఈ సర్వే స్పష్టం చేసింది. మణిపూర్ అసెంబ్లీకీ వీటితో పాటు ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అక్కడ ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై సర్వే జరుగలేదు.
మొత్తం 403 సీట్లు కలిగిన ఉత్తర ప్రదేశ్లో బిజెపికి 192-196 మధ్య సీట్లు రావచ్చునని, అలాగే ఇటీవలే పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్-ఎస్పీ కూటమి 178-182 మధ్య సీట్లతో రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని సర్వే ఫలితాలు పేర్కొన్నాయి. మాయావతి సారథ్యంలోని బిఎస్పి 20 నుంచి 24మధ్య సీట్లతో మూడోస్థానాన్ని దక్కించుకోవచ్చునని తెలుస్తోంది.
పంజాబ్లో మాత్రం అసెంబ్లీలోని 117 సీట్లలో 51స్థానాల వరకూ గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని, 33నుంచి 35సీట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ ద్వితీయ స్థానాన్ని దక్కించుకోవచ్చునని తెలిపింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్లోనే బిజెపి పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని తెలిపింది.
అసెంబ్లీలోని మొత్తం 70స్థానాల్లో బిజెపికి 37 నుంచి 39సీట్ల మధ్య రావచ్చునని అభిప్రాయ సేకరణ వివరాలను బట్టి ఈ సంస్థ అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు 27 నుంచి 29సీట్ల మధ్య రావచ్చునని వెల్లడించింది.
గోవా అసెంబ్లీలోని మొత్తం 40సీట్లలో అధికార బిజెపి 17 నుంచి 19సీట్లు దక్కించుకోవచ్చునని అంచనావేసింది. 11 నుంచి 13సీట్లతో కాంగ్రెస్కు రెండోస్థానం దక్కవచ్చునని పేర్కొంది. మహారాష్ట్ర గోమాంతక్ పార్టీకి 3 నుంచి 5సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.