పన్నీర్, పళనిసామి చెట్టాపట్టాలు: దినకరన్ పరిస్థితి గోవింద గోవిందా !
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. శశికళ అక్క కుమారుడు టీటీవీ. దినకరన్ ను ఇంటికి పంపించడానికి శత్రువులు అంతా ఒక్కటి అవుతున్నారని వెలుగు చూసింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ. దినకరన్ కు డి
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. శశికళ అక్క కుమారుడు టీటీవీ. దినకరన్ ను ఇంటికి పంపించడానికి శత్రువులు అంతా ఒక్కటి అవుతున్నారని వెలుగు చూసింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ. దినకరన్ కు డిపాజిట్ వస్తే గొప్ప అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
శశికళకు ఇష్టం లేకుండా, ఆమెను సంప్రదించకుండా టీటీవీ. దినకరన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని సమాచారం. అయితే దినకరన్ పోటీ చెయ్యడం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి మొదటి నుంచి ఇష్టం లేదని సమాచారం.
శశికళ అనుమతితోనే
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ. దినకరన్ పోటీ చెయ్యడం మొదటి నుంచి చిన్నమ్మ శశికళకు ఇష్టం లేదని ఆమె వర్గంలోని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు. అయితే శశికళ అనుమతి లేకుండా ఇప్పుడు దినకరన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆమె వర్గంలోని నాయకులు మండిపడుతున్నారు.
దినకరన్ అంటే తమాషా ?
రాజ్యసభ మాజీ సభ్యుడైన టీటీవీ. దినకరన్ ను గతంలో జయలలిత మెడపట్టి పోయెస్ గార్డెన్ నుంచి బయటకు గెంటేశారు. ఇప్పుడు అమ్మ వారసుడు నేనే అంటూ సంకలు గుద్దుకుని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల నుంచి పోటీ చేస్తున్నారు.
ఉప ఎన్నికల్లో దినకరన్ గెలిస్తే ?
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ గెలిస్తే తన సీటుకే ఎసరు వస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఆందోళన చెందుతున్నారని సమాచారం. అందుకే దినకరన్ నామినేషన్ వేసే సమయంలో పళనిసామి దూరంగా ఉన్నారని ఆయన వర్గీయులు అంటున్నారు.
స్వామి భక్తి అంటే ఇదేనా !
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా దినకరన్ ను ఓడించాలని పళనిసామి వర్గీయులు కంకణం కట్టుకున్నారని విశ్వసనీయ సమాచారం. అందుకే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో ఎడప్పాడి పళనిసామి వర్గీయులు చేతులు కలిపారని తెలిసింది.
మధుసూదనన్ పేరుకు మాత్రమే ?
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పన్నీర్ సెల్వం వర్గం నుంచి పోటీ చేస్తున్న మధుసూదనన్ పేరుకు మాత్రమే ఉన్నారని, దీపాను అక్కడి నుంచి గెలిపించాలని ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మొత్తం మీద దినకరన్ కు డిపాజిట్ కూడా రాకుండా చెయ్యాలని అందరూ ప్లాన్ చేస్తున్నారని వెలుగు చూసింది.
అమ్మ అభిమానులు ఎవరి వైపు ?
గురువారం నామినేషన్ వేసిన తరువాత దినకరన్ తల మీద టోపీ పెట్టుకోకుండా బయటకు రావడం లేదు.. ఆయనకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన టోపి గుర్తుకు ప్రజలు ఓటువేస్తారా ? లేక కేవలం టోపి మాత్రంమే ఆయనకు పెడుతారా ? అంటు శశికళ వర్గం నాయకులు గుసగుసలాడుతున్నారు.