షాక్: ఉన్నావ్ పోలీస్స్టేషన్లో వంద ఆస్థి పంజరాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్లోని ఓ గదిలో లభించిన వందమంది ఆస్థి పంజరాలు సంచలనం సృష్టించాయి. ఉన్నావ్ పోలీస్ లైన్స్లోని పాతికేళ్లుగా మూతబడి ఉన్న ఓ గదిని తెరవగా అందులో 10 సంచులు లభించాయి. ఆ సంచుల్లో వందకు పైగా వ్యక్తుల ఆస్థి పంజరాలు ఉన్నాయి.
2008 వరకు ఈ ప్రాంతాన్ని ఓ ఆస్పత్రి ఉపయోగించుకుందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఆస్థి పంజరాలు ఉన్న ఆ ప్రాంతం ఆ ఆస్పత్రికి చెందిన పోస్టుమార్టంకు ఉపయోగించుకున్నదని వారు తెలిపారు. ‘ 2008 దాకా ఆ ప్రాంతాన్ని ఓ ఆస్పత్రి ఉపయోగించుకుందని నా దృష్టికి వచ్చింది. దీనిపై పోలీసులను ఓ నివేదిక తయారు చేయమని ఆదేశించాం. లభించిన ఆస్థి పంజరాల వివరాలను తెలుసుకునేందుకు వాటిని ల్యాబ్కు పంపిస్తున్నాం' అని ఉన్నావ్ జిల్లా మేజిస్ట్రేట్ సౌమ్య అగర్వాల్ తెలిపారు.
కాగా, ఉన్నావ్ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరారు. ఒకవేళ ఈ ఆస్థిపంజరాలు ఫోరెన్సిక్ ఉద్దేశించినవైతే ఇలా సంచుల్లో పెట్టరని.. ల్యాబోరేటరీలోనే ఉంచబడతాయని హైదరాబాద్ ఫోరెన్సిక్ సెంటర్ మాజీ డైరెక్టర్ ఎస్కె శుక్లా తెలిపారు. ఒకవేళ వాటిని లాబోరేటరీ వారిచే సంరక్షించబడితే వాటికి సంబంధించిన వివరాలు డాక్యుమెంటేషన్ చేయబడి ఉండాలని, ఇక్కడ అలాంటి జరగలేదని చెప్పారు.
ఉన్నావ్ ఘటనపై నివేదిక తయారు చేయమని జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా ఎస్పీలను ఆదేశించామని ఉన్నావ్ ఇంఛార్జ్ మంత్రి ఎస్పి యాదవ్ తెలిపారు. ఇందులో దాచడానికి ఏమిలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని చెప్పారు. అయితే ఈ ఆస్థిపంజరాలు ఇక్కడ ఎందుకు ఉంచబడ్డాయనే విషయం మొదటగా తెలియాలని అన్నారు.
ఈ ఘటనపై నివేదిక కోరినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తెలిపారు. కాగా, ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.