సరైనోడు: అవినీతి పోలీసుల్లో వణుకు పుట్టిస్తున్న సీఎం.. ఇప్పటి వరకు 100 మందిపై వేటు
ఉత్తరప్రదేశ్ పోలీసుల్లో వణుకు మొదలైంది. కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొలువుదీరిన ఈ కొద్దిరోజుల్లోనే 100 మందికిపైగా పోలీసులపై వేటు పడింది.
లఖ్ నవూ: అవినీతిపరుల ఏరివేతకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నడుంబిగించింది. రాష్ట్రంలో శాంతి భద్రదతలను పరిరక్షించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమని యూపీలో కొత్తగా కొలువుదీరిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ముందుగా అవినీతి బారినుంచి ప్రక్షాళన చేయడంలో భాగంగా పోలీసుశాఖనే ఎంచుకుంది. సీఎంగా యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 100 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు.
వీరిలో ఎక్కువగా ఘజియాబాద్, మీరట్, నోయిడా ప్రాంతాల్లో పనిచేస్తున్న వారే ఉన్నారు. వేటు పడిన వారిలో లక్నోకు చెందిన ఏడుగురు ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. డీజీపీ జావీద్ అహ్మద్ ఆదేశాల మేరకు పోలీసులను సస్పెండ్ చేసినట్లు యూపీ పోలీస్ పీఆర్వో రాహుల్ శ్రీవాత్సవ తెలిపారు.
పోలీసు డిపార్ట్ మెంట్ లో అవినీతిపరులైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని, సస్పెండ్ అయిన వారిలో ఎక్కువ మంది కానిస్టేబుల్ స్థాయి వారేనని శ్రీవాత్సవ తెలిపారు.
యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటలకే హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దేవాశిష్ పాండా పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పోలీసులపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పీఆర్వో రాహుల్ శ్రీవాత్సవ తెలిపారు.