నివ్వెరపోయే నిజం : ఇండియాలో టీబీ విస్తరించడానికి కారణం!
న్యూఢిల్లీ : దేశంలో టీబీ వ్యాధి అధికంగా ప్రబలడానికి కారణం ఇండియాలో అవలంభిస్తోన్న ఔషధ విధానాలే అంటున్నారు కెనడాలోని మెక్ గిల్ యూనివర్సిటీ పరిశోధకులు. ప్రపంచంలో టీబీ ప్రభావిత దేశాల్లో ఇండియా టాప్ లో ఉండడంతో.. దీనిపై లోతుగా విశ్లేషణలు జరిపిన పరిశోధకులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మితిమీరిన యాంటీ బయాటిక్స్ వాడకం వల్లే ఇండియాలో ఎక్కువ మంది టీబీ బారిన పడుతున్నట్లుగా పరిశోధకులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక యాంటీ బయాటిక్స్ ను ఉపయోగిస్తుండడం వల్ల దేశంలో ఈ పరిస్థితి నెలకొందని పరిశోధకులు చెబుతున్నారు. పరిమితికి మించి యాంటీ బయాటిక్స్ ను వాడుతుండడం వల్ల క్షయ వ్యాధి మందులకు లొంగకుండా తయారవుతోందంటున్నారు పరిశోధకులు.
దేశంలో ఉన్న ఫార్మాసిస్టుల అవగాహన రాహిత్యం కూడా వ్యాధి తీవ్రతను పెంచేదిగా మారిందని సంచలన విషయం బయటపెట్టారు. క్షయ వ్యాధి తీవ్రతరమైన వారికి కూడా సాధారణ యాంటీ బయాటిక్స్ ఇస్తుండడం వల్లే క్షయ వ్యాధి నిర్మూలన కష్ట సాధ్యంగా మారిందంటున్నారు. క్షయను నిర్మూలించడానికి ఉపయోగపడే ఫస్ట్ లైన్ యాంటీ టీబీని (ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్, ఇథాంబుటాల్, స్ట్రెస్టోమైసిన్) ను ఫార్మాసిస్టులు వ్యాధిగ్రస్తులకు అందించడం లేదనేది తాజా పరిశోధనలో తేలింది.
వైద్యుడి సలహాలు అవసరం లేకుండానే.. యాంటీ బయాటిక్స్ వాడుతున్న ఎంతోమందిలో వ్యాధి తీవ్రత పెరగడంతో పాటు, భవిష్యత్తులో మందులకు లొంగకూడని రీతిలో క్షయ మరింత తీవ్రతరం అవుతోందని చెబుతున్నారు పరిశోధకులు.