‘లూలూజీ బంగ్లా ఖాళీ చేయండి’: మాజీ ఎంపీలకు కేంద్రం
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ను ప్రభుత్వం కేటాయించిన తుగ్లక్ రోడ్లోని బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని కేంద్రం కోరింది. తనను మరికొంత కాలం ఈ భవనంలో నివాసం ఉండేందుకు అనుమతించాలని లాలూ ప్రసాద్ యాదవ్ చేసుకున్న వినతిని కేంద్రం నిరాకరించింది.
అక్టోబర్ 31తోనే గడువు ముగిసినందున లాలూ ప్రసాద్ యాదవ్కు బంగ్లా ఖాళీ చేయాలని నోటీసు పంపాపమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వ బంగ్లాలో నివాసం ఉండేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును కోరారని ఆయన చెప్పారు.
పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ లాలూ ప్రసాద్ యాదవ్ విజ్ఞప్తిని నిరాకరించిందని, ఆయనకు ప్రభుత్వ బంగ్లాలో నివాసం ఉండేందుకు అనుమతి లేదని తెలిపిందని ఆయన చెప్పారు. లాలూ ప్రసాద్ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసేందుకు కొంత సమయం ఇచ్చామని, ఆ సమయంలోపే ఖాళీ చేయాల్సి ఉంటుందని, లేదంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
2004 నుంచి తుగ్లక్ రోడ్లోని ప్రభుత్వ అధికారిక బంగ్లాలో లాలూ ప్రసాద్ నివాసం ఉంటున్నారు. గడ్డి కుంభకోణంలో దోషిగా తేలడంతో అతని ఎంపి సభ్యత్వం రద్దయిపోయింది. కాగా, గత యూపిఏ ప్రభుత్వంలోని మంత్రి కమల్నాథ్.. లాలూ ప్రసాద్ యాదవ్కు అక్టోబర్ 31, 2014 వరకు ప్రభుత్వ బంగ్లాలో ఉండేందుకు అనుమతిచ్చారు. ఆ సమయం ముగిసినందున బంగ్లాను ఖాళీ చేయాలని లాలూ ప్రసాద్ను కేంద్రం ఆదేశించింది.
లాలూతోపాటు నోటీసులందుకున్న వారిలో కేంద్రహోంశాఖ మాజీ మంత్రి భూటాసింగ్, దివంగత నేతలు మాజీ రాష్ట్రపతి కృష్ణకాంత్, కేంద్రమాజీ మంత్రి అర్జున్ సింగ్ కుటుంబాలున్నాయి. వీరితోపాటు మాజీ ప్రధాని పివి నర్సింహారావు కుమారుడు పివి ప్రభాకరరావు కూడా ఉన్నారు.