భారత జవాన్ ను విడిచిపెట్టిన పాకిస్థాన్: మోడీ, ట్రంప్ ఎఫెక్ట్ !
న్యూఢిల్లీ: ఇంత కాలం భారత్ తో కయ్యానికి కాలుదువ్విన పాక్ నేడు అనూహ్యంగా స్నేహహస్తం చాచడంతో ప్రపంచ దేశాలు ముక్కున వేలువేసుకున్నాయి. పాక్ లో గత నాలుగు నెలల నుంచి బందీగా ఉన్న జవాను చందు బాబులాల్ చౌహాన్ (22)ను ఎట్టకేలకు విడుదల చేశారు.
2016 సెప్టెంబర్ 20వ తేదిన భారత్ పాక్ అక్రమిత కాశ్మీర్ లో సర్జికల్ స్టైక్ దాడులు చేశారు. ఆ మరుసటి రోజు రాష్ట్రీయ రైఫిల్ బలగానికి చెందిన సైనికుడు చందు బాబులాల్ చౌహాన్ పొరపాటున భారత సరిహద్దు దాటి పాక్ అక్రమిత కాశ్మీర్ లోకి వెళ్లాడు.
ఆ సమయంలో పాక్ బలగాలు చందు బాబులాల్ చౌహాన్ ను ప్రాణాలతో పట్టుకుని బందీ చేశారు. చందు బాబులాల్ చౌహాన్ ను విడిపించడానికి కేంద్ర హోం, విదేశాంగ మంత్రిత్వ శాఖలు పలు ప్రయత్నాలు చేశాయి. సర్జికల్ స్ట్రైక్ దాడుల్లో చందు బాబులాల్ చౌహాన్ పాల్గొనలేదని, పొరపాటున ఆయన సరిహద్దు దాటాడని భారత్ పాక్ కు చెప్పింది.
భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని మానవీయదృష్టితో జవాను చందు బాబులాల్ చౌహాన్ ను విడుదల చేస్తున్నామని పాక్ ప్రభుత్వం తెలిపింది. పాక్ సైనిక అధికారులు వాఘా సరిహద్దు వద్ద జవాను చందు చౌహాన్ ను భారత ఆర్మీ అధికారులకు అప్పగించారు. చందు బాబులాల్ చౌహాన్ విడుదల కావడంతో మహారాష్ట్రలోని ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.