ఒబామా టూర్, అమెరికా హెచ్చరిక: ఐనా జమ్మూలో పాక్ కాల్పులు
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి హద్దు దాటింది! ఆదివారం ఉదయం జమ్మూ జిల్లా పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్ల పోస్టుల పైన పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరిపారు. పాక్ సైన్యం ఆర్ ఎస్ పురా సెక్టారులోని జోగ్వానా పోస్టు పైన కాల్పులు జరిపారని సైన్యాధికారి ఒకరు తెలిపారు.
తేలికపాటి ఆయుధాలు, ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలు భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయన్నారు. ఈ కాల్పులు ఉదయం ఒకటి గంటల నుండి ఒకటింపావు వరకు కొనసాగాయని తెలిపారు.
అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీ ఒబామా భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వారి భారత్ చేరుకునే గంటల ముందు పాకిస్తాన్ ఈ కాల్పులకు దిగింది. కనీసం ఒబామా పర్యటన సందర్భంగానైనా పాకిస్తాన్ హద్దు మీరవద్దని అమెరికా హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పాకిస్తాన్ పెడచెవిన పెట్టింది.