పాక్ దుస్సాహసం: ఆక్రమిత ప్రాంతానికి రాష్ట్ర హోదా, భారత్ ఆందోళన
పాకిస్థాన్ మరో దుశ్శాహసానికి ఒడిగట్టింది. పాక్ ఆక్రమిత భారత భూభాగం గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భాగమైన ఈ ప్రాంతం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరో దుశ్శాహసానికి ఒడిగట్టింది. పాక్ ఆక్రమిత భారత భూభాగం గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భాగమైన ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా మనదేశానికి ఎంతో కీలకమైనది.
అయితే, గిల్గిత్-బాల్టిస్థాన్కు రాష్ట్ర హోదా కల్పించాలని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ సారథ్యంలోని కమిటీ సిఫార్సు చేసినట్లు పాక్ అంతర్రాష్ట్ర సమన్వయశాఖ మంత్రి రియాజ్ హుస్సేన్ పీర్జాదా మంగళవారం 'జియో టీవీ'తో చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ హోదా కల్పించేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేస్తామని తెలిపారు. పాక్లో ఇప్పుడు బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్, సింధ్ రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రత్యేక ప్రాంతంగా పాక్ పరిగణిస్తున్న గిల్గిత్-బాల్టిస్థాన్కు ప్రాంతీయ అసెంబ్లీతోపాటు ముఖ్యమంత్రి ఉన్నారు. కాగా, ఈ వివాదాస్పద ప్రాంతానికి సంబంధించిన తాజా పరిణామాలు భారత్కు కలవరం కలిగిస్తున్నాయి.
దాదాపు రూ.3 లక్షల కోట్లతో చేపడుత్ను చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ) గిల్గిత్-బాల్టిస్థాన్ గుండానే సాగుతుంది. ఈ ప్రాంత హోదాపై సమస్యలను తొలగించాలన్న చైనా ఒత్తిడి నేపథ్యంలోనే పాక్ ఈ చర్య చేపడుతున్నట్లు తెలుస్తోంది.
సీపీఈసీ ప్రాజెక్టుకు చట్టపరమైన రక్షణ ఉండేలా ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించాలని పాక్ భావిస్తోందని 'డాన్' పత్రిక ఇంతకుముందు ఒక కథనంలో వెల్లడించింది. గిల్గిత్-బాల్టిస్థాన్ను పాక్ గతంలో 'ఉత్తర ప్రాంతాలు'గా వ్యవహరించేది. పాక్ తాజా నిర్ణయం భారత్కు ఆందోళన కలిగించే విషయమేనని విశ్లేషకులు చెబుతున్నారు.