వారిద్దర్నీ అప్పగించండి: పాక్కు వెంకయ్య, 'పెషావర్'పై పాక్ ఓపెనర్ కంటతడి
న్యూఢిల్లీ/లాహోర్: పాకిస్తాన్ దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయిద్లను భారత దేశానికి అప్పగించాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గురువారం డిమాండ్ చేశారు. పెషావర్ సైనిక పాఠశాలపై తాలిబన్ల దాడి నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరును మొదలు పెట్టాల్సిందేనని పాకిస్థాన్ తీర్మానించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు ఆ దేశాధినేతల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను రక్షిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉగ్రవాదాన్ని నిజంగా తీవ్రంగా పరిగణించేందుకు తీర్మానిస్తే మొదట పాకిస్తాన్ భూభాగంలోని తీవ్రవాదులపై చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది.
పాకిస్తాన్ భూభాగం పైన ఉంటూ తమ దేశం పైన దాడులు చేసిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీంలను అప్పగించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య అన్నారు. తద్వారా ఉగ్రవాదులపై పోరులో తమ సహకారాన్ని కూడా తీసుకోవచ్చన్నారు.
ప్రపంచంలో టెర్రరిజాన్ని వ్యాప్తి చేస్తున్న వారిలో హఫీజ్ సయీద్ ముఖ్యుడన్నారు. అతను మానవత్వానికి శతృవు అని అభివర్ణించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తీవ్రవాదం పైన ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటారని తాను ఆశిస్తున్నానని చెప్పారు.
కన్నీంటిపర్యంతమైన క్రికెటర్
పెషావర్లోని ఓ సైనిక పాఠశాలపై తాలిబన్లు దాడి చేసి వందలాదిగా విద్యార్థులను బలిగొనడంపై సర్వత్రా అంతటా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో అబుదాబిలో పాకిస్థాన్ జట్టు వన్డే సిరీస్ ఆడుతోంది. ఈ సందర్భంగా.. పెషావర్ ఘటన గురించి తెలిసిన వెంటనే క్రికెటర్లందరూ దిగ్బ్రాంతికి గురయ్యారు. బుధవారం ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే జరిగింది.
చిన్నారుల మృతికి సంతాపంగా మ్యాచ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లు నిమిషం పాటు మౌనం పాటించారు. ఈ సమయంలో పాకిస్తాన్ ఓపెనర్ అహ్మద్ షేజాద్ కన్నీటి పర్యంతమయ్యాడు. భావోద్వేగాలను నియంత్రించలేక విలపించాడు. అందరి గుండెలు బరువెక్కాయి. పాక్ సీనియర్ క్రికెటర్ యూనిస్ ఖాన్ మాట్లాడుతూ.. సైనిక పాఠశాలపై తాలిబన్ల దాడి అనాగరిక చర్య అని, జాతీయ విషాదంగా పరిగణించాల్సిన ఘటన అని పేర్కొన్నారు.