జైలుకు రావొద్దని శశికళ వర్తమానం.. ఆశీర్వాదం కావాలని పళనిస్వామి లేఖ
జయలలిత అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు.తన అక్క కుమారుడు దినకరన్ ద్వారా శశికళ పళనిస్వామికి ఈ వర్తమానం చేరవేశారు.
బెంగుళూరు: వాస్తవానికి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళను కలవాలని పళనిస్వామి నిర్ణయించుకున్నారు. అయితే ఆ వెంటనే బలనిరూపణకు సిద్దపడటంతో ఆ ప్రయత్నం వాయిదా పడింది.
అటు తర్వాత బలనిరూపణలోను తమ వర్గమే విజయం సాధించడంతో ఇక చిన్నమ్మను కలిసేందుకు పళనిస్వామి రెడీ అయిపోయారు. అయితే ఇంతలోనే తనను కలవడానికి రావద్దంటూ చిన్నమ్మ నుంచి వారికి కబురు అందింది. తనను కలవడానికి వెచ్చించే సమయాన్ని మున్ముందు చేయాల్సిన పనుల కోసం కేటాయించాల్సిందిగా శశికళ పళనిస్వామికి సూచించారు.
జయలలిత అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు.తన అక్క కుమారుడు దినకరన్ ద్వారా శశికళ పళనిస్వామికి ఈ వర్తమానం చేరవేశారు. అయితే సీఎం పళనిస్వామి మాత్రం శశికళను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకోవాలని భావిస్తున్నారు.
ఇందుకోసం ఆయన చిన్నమ్మకు లేఖ కూడా రాశారు. లేఖ పట్ల చిన్నమ్మ సానుకూలంగా స్పందిస్తుందని వారు భావిస్తున్నారు. అన్నాడీఎంకెలో పలువురు నేతలు, కార్యకర్తలు సైతం శశికళను కలవడానికి పరప్పన జైలుకెళ్లారు. అయితే శశికళ వారిని కలవడానికి నిరాకరిచండంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు.