పన్నీర్కు దేశ విదేశాల్లో భారీ ఆస్తులు: గుట్టు విప్పుతామంటున్న దినకరన్!
పన్నీర్ సెల్వంకు దేశ, విదేశాల్లో భారీ వ్యాపారాలున్నాయని దినకరన్ ఆరోపించారు. త్వరలోనే ఆయన ఆస్తుల చిట్టా విప్పేందుకు ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు.
చెన్నై: ఆర్కేనగర్ ఉపఎన్నిక దగ్గరపడుతుండటంతో గెలుపు కోసం ఆయా పార్టీలు, వర్గాలు కసరత్తులు మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కూడా మొదలైన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా అన్నాడీఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవి దినకరన్ పన్నీర్ సెల్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
పన్నీర్ సెల్వంకు దేశ, విదేశాల్లో భారీ వ్యాపారాలున్నాయని దినకరన్ ఆరోపించారు. త్వరలోనే ఆయన ఆస్తుల చిట్టా విప్పేందుకు ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. 2000సం.లో పన్నీర్ సెల్వంను తానే జయలలితకు పరిచయం చేశానని దినకరన్ పేర్కొన్నారు. కేవలం పదేళ్ల కాలంలో ఇంత భారీగా ఆయన ఆస్తులు ఎలా పెరిగాయని దినకరన్ ప్రశ్నించారు.
తిరువన్నమలైలో శనివారం రాత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ దినకరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పెరియా కులానికి చెందిన తొలి ఎమ్మెల్యేగా 2001లో పన్నీర్ సెల్వం చెన్నైకి వచ్చినప్పుడు.. ఆయన స్థితి గతులేంటో తనకు తెలుసన్నారు. పన్నీర్ తరుచూ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో త్వరలోనే గుట్టు విప్పుతామన్నారు.
పన్నీర్ సెల్వం బంధువులు, కొడుకులు, అల్లుళ్లు తరుచూ చెన్నై నుంచి ఢిల్లీకి, విదేశాలకు ఎందుకు వెళ్తున్నారో, దాని వెనుక అసలు కారణాంలేంటో దర్యాప్త ద్వారా బహిర్గతం చేస్తామని, త్వరలోనే దీనిపై విచారణకు ఆదేశిస్తామని అన్నారు. కాగా, అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ తాను జైలుకు వెళ్లేముందు దినకరన్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి దినకరన్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. తాజా వ్యాఖ్యలపై పన్నీర్ సెల్వం ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.