దీప మా ప్రత్యర్థి కాదు.. ఆమెను ఉన్నతంగా చూడాలనుకుంటున్నాం: పన్నీర్ వర్గం..
దీపను తాము ప్రత్యర్థిగా భావించడం లేదని, ఆమెను మరింత ఉన్నతంగా చూడాలనుకుంటున్నామని పాండ్యరాజన్ వ్యాఖ్యానించారు.
చెన్నై: ఆర్కేనగర్ బరిలో పన్నీర్ సెల్వం వర్గం, చిన్నమ్మ శశికళ వర్గం తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అటు జయలలిత మేనకోడలు దీప సైతం బరిలో ఉండటంతో ఓటర్లు ఎవరివైపు మొగ్గుతారో అంచనా వేయడం కష్టంగా ఉన్న పరిస్థితి. ఇప్పటికే ప్రజల్లో సానుభూతిని ఏర్పరుచుకున్న పన్నీర్ సెల్వంకు దీప పోటీ కాస్త ప్రతికూలంగానే మారిందని చెప్పాలి.
తొలుత పన్నీర్ సెల్వం వర్గానికి దీప మద్దతుగా నిలుస్తారని అంతా భావించినప్పటికీ.. కొత్త పార్టీ పెట్టిన దీప బరిలో దిగుతున్నానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్కేనగర్ లో త్రిముఖ పోరుపై చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పన్నీర్ సెల్వం వర్గం నేత, మాజీ మంత్రి మాఫో పాండ్యరాజన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీపను తాము ప్రత్యర్థిగా భావించడం లేదని, ఆమెను మరింత ఉన్నతంగా చూడాలనుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే దీపతో తలపడటం కన్నా.. ఆమెను మచ్చిక చేసుకుని తమవైపు తిప్పుకోవాలన్న భావనలో పన్నీర్ సెల్వం వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. దీపతో కలిసి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని కూడా పాండ్యరాజన్ ప్రకటించారు. దీంతో దీప-పన్నీర్ వర్గాలు మళ్లీ కలవబోతున్నాయా? ఆసక్తికర చర్చ మొదలైంది.
కాగా, దివంగత జయలలిత ఆశీర్వాదంతో ఇ.మధుసూదనన్ తమ వర్గం నుంచి ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేస్తారని పాండ్యరాజన్ తెలిపారు. తమకు ప్రత్యర్థి దీప కాదని, డీఎంకే మాత్రమేనని స్పష్టం చేశారు.