పన్నీర్ వ్యూహం: శశికళను చావుదెబ్బ తీయడమే..
తాజా పరిణామాల నేపథ్యంలో శశికళను తిరిగి తలెత్తకుండా కొట్టడమే వ్యూహంగా పన్నీర్ సెల్వం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
చెన్నై: తనను నిండా ముంచిన జయలలిత ప్రియసఖి శశికళను లేవకుండా కొట్టడమే వ్యూహంగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆయన పెట్టిన మూడు డిమాండ్లలో అత్యంత ముఖ్యమైంది, వ్యూహత్మకమైంది జయలలిత మృతిపై సమగ్ర విచారణ జరిపించాలనేది.
జయలలిత మృతిపై సమగ్ర విచారణ జరిపితే శశికళ పాత్ర బయటపడుతుందని, దానివల్ల శశికళకు భవిష్యత్తు ఉండదని పన్నీర్ సెల్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే అత్యంత వ్యూహాత్మకంగా జయలలిత మృతిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు.
ముఖ్యమంత్రి పళనిస్వామితో కలిసి పనిచేయడానికి తన వర్గాన్ని ఆయన వర్గంలో కలపడానికి ఆయన మరో రెండు డిమాండ్లు పెట్టారు. అన్నాడియంకె ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించాలనేది ఆయన మరో డిమాండ్. దినకరన్నే కాదు, శశికళను కూడా పార్టీ నుంచి తప్పించాలనేది ఆయన ఇంకో డిమాండ్.
అలా పంతం నెగ్గించుకున్న శశికళ
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం సాగిన పోరులో జైలుకు వెళ్లి కూడా శశికళ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తన వర్గానికి చెందిన పళనిస్వామిని ముఖ్యమంత్రి పీఠంపై కోర్చోబెట్టి పన్నీరు సెల్వంను దెబ్బ తీశారు. దాంతో తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీలో ఆధిపత్యం కోసం పన్నీరు సెల్వం మళ్లీ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
దినకర్ వ్యవహారం కలిసొచ్చింది...
ఎన్నికల కమిషన్కు రెండాకుల గుర్తు కోసం లంచం ఇవ్వజూపారనే కేసులో దినకరన్కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేయడం పన్నీర్ సెల్వంకు బాగా కలిసి వచ్చింది. అంతేకాదు, దినకరన్ను ఢిల్లీ పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చు. పైగా, పోలీసులు ఎఫ్ఐఆర్లో సుకేష్ చంద్రశేఖర్ పేరుతో పాటు దినకరన్ పేరు కూడా చేర్చారు. దినకరన్ పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో పన్నీరు సెల్వం ఎదురు వర్గంపై పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు
ఇదే అదనుగా పన్నీరు సెల్వం...
అన్నాడియంకెలో గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పకపోతే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్న శశికళ వర్గం పన్నీర్ సెల్వంతో చర్చలు సాగిస్తోంది. అయితే ఇదే అవకాశంగా తీసుకుని పన్నీర్ సెల్వం మూడు ప్రధానమైన డిమాండ్లు పెట్టారు.శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగడంపై పన్నీర్ మొదటి నుంచీ అసంతృప్తితో ఉన్నారు. దాంతో ఆమెను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
వారిద్దరినీ పార్టీ నుంచి తప్పిస్తే...
దినకరన్ను, శశికళను పార్టీ నుంచే తప్పించాలనే పన్నీరు సెల్వం డిమాండ్ అత్యంత ప్రధానమైంది. తాను పదవి నుంచి తప్పుకుంటానని, శశికళను పదవిలో కొనసాగించాలని దినకరన్ ముందుకు వచ్చినా పన్నీరు సెల్వం అంగీకరించే పరిస్థితిలో లేరు వారిద్దరూ పార్టీలోనే కొనసాగితే తనకు తగినంత ప్రాధాన్యం దక్కదనే భావనతో పన్నీరు సెల్వం ఉన్నట్లు తెలుస్తోంది. పైగా, వారిద్దరినీ రాజకీయంగా తిరిగి తలెత్తకుండా చేయాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.